Land Scam: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉద్యోగులు పని చేయాలి. ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో వీరిది కీలక పాత్ర. కానీ, కొందరు ఏం పట్టించుకోకుండా విలువైన ఆస్తులను వదిలివేయడం కబ్జాదారులకు వరంగా మారుతున్నది. జీహెచ్ఎంసీ(GHMC) సర్కిల్ 3 పరిధిలోని అధికారుల వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీకి అప్పగించిన విలువైన భూమిని కాపాడుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాత్రికి రాత్రి నేలను చదును చేసి రాయితో పునాది వేయడం, పక్కనే ఫ్రీకాస్ట్ పేరుతో ప్రహారీలు నిర్మించడం చూస్తుంటే అసలు అధికారులు ఉన్నారా లేదా అనే డౌట్ సర్వత్రా వినిపిస్తున్నది.
విలువైన భూమి కబ్జా
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అన్మగల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 191లో ఎకరం 9 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమి విజయవాడ, సాగర్ జాతీయ రహదారులను కలిపే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ భూమి విలువ సుమారుగా రూ.60 కోట్లకు పైనే ఉంటుంది. కబ్జాదారులు దర్జాగా ఓ అపార్ట్మెంట్ కోసం దారి వేసుకున్నారు. వాస్తవంగా ఆ అపార్ట్మెంట్కు దారి నేరుగా లేదు. మహబూబ్నగర్(Mahabubnagar) జిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ(ZPTC) వెంకటేశ్వర్(Venkateshwar) ఈ అపార్ట్మెంట్ నిర్మాణం చేశారు. ఈయనకు ప్రభుత్వ స్థలంలో నుంచి ప్రధాన రహదారి నుంచి దారి వేసుకునేందుకు ఎమ్మెల్యేల)MLA) మద్దతు ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. దారి కోసం 400 గజాల స్థలం వరకు రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారు. దీనిని ఆసరా చేసుకొని గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు 100 గజాల చొప్పున ఫ్రీకాస్ట్ వేసి ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్నారు. ఈ భూమిలోనే జీహెచ్ఎంసీ(GHMC) సూచించిన బోర్డు పెట్టినప్పటికీ కబ్జాదారులు భయపడకుండా విక్రయాలు చేస్తున్నారు.
Also Read; Kavitha: గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు.. నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. కవిత కీలక వ్యాఖ్యలు
కాపాడినా ఫలితం లేదు
ఇదే భూమిలో పేదలు ఇంటి స్థలం కోసం గుడిసెలు వేస్తే గతంలో రెవెన్యూ(Revenue) అధికారులు తొలగించారు. అయితే, స్థానిక సీపీఐ(CPI) నాయకులు హయత్నగర్(haythnagar) రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. తదనంతరం జరుగుతున్న పరిణామాలపై సీపీఐ నాయకులు ప్రభుత్వ భూమిని కాపాడని పక్షంలో గుడిసెలు వేస్తామని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. అయితే ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూమియైన ఎకరం 9 గుంటల భూమిని జీహెచ్ఎంసీ బదులాయింపు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు గత రెండు నెలల వరకు ఈ భూమిని కాపాడినప్పటికీ ప్రస్తుతం ప్రయోజనం లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సమాచారం.
కాపాడకపోతే గుడిసెలు వేస్తాం
అన్మగల్లో కబ్జాకు గురైన ఎకరం 9 గుంటల ప్రభుత్వ భూమిని కాపాడాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. గత నాలుగేళ్లుగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా కోట్ల విలువైన భూమిని అధికారులకు అప్పగించాం. అయినప్పటికీ గత నెల రోజులుగా కబ్జాదారులు తిరిగి భూమిని స్వాధీనం చేసుకునేందుకు నిర్మాణాలు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 3 కమీషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. త్వరలో హైడ్రా అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే పేదల గూడు కోసం గుడిసెలు వేస్తామని, సామిడి శేఖర్ రెడ్డి, సీపీఐ ఎల్బీనగర్ కార్యదర్శి అన్నారు.
Also Read: Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్టెర్మ్ రిలేషన్షిప్ అంట, ఎవరితోనంటే?
