Gadwal District: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ అధికారుల వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి, సరైన పత్రాలు లేకుండా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ఈ తనిఖీల్లో కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్(Drunk And Drive) లో మళ్ళీ మళ్ళీ పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రద్దీ ప్రదేశాలలో తనిఖీలు
రోడ్డు భద్రతా నియమాలు పతి వాహనదారుడు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 13 పోలీస్ స్టేషన్ ల పరిధిలో గ్రామాలు, పట్టణాలు,ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రదేశాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తనిఖీలు చేస్తున్నారు. గతేడాది వాహన తనిఖీల్లో 32560 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేయగా 2024 లో 3,206 కేసులు నమోదు కాగా 2025 లో 7,056 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. 33 లక్షల 96 వేల రూపాయల జరిమానా విధించారు. పలుమార్లు మద్యం తాగి పట్టుబడిన 67 మందిని జైలుకు పంపించారు.
Also Read: Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సంక్రాంతి శోభ.. డ్యాన్స్ చేసిన పవన్.. మూడ్రోజులు ధూమ్ ధామ్!
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2025లో 204 రోడ్ ప్రమాదాలు జరగా 135 మంది మృత్యువాత పడ్డారు. 189 మంది గాయాలపాలయ్యారు. అంతకు ముందు ఏడాది 207 రోడ్డు ప్రమాదాలు జరగా 133 మంది మృత్యువాత పడ్డారు. అక్టోబర్ నెలలో గద్వాల పట్టణానికి చెందిన రెండవ రైల్వే గేట్ కాలనీకి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై జమ్మి చెడు నుంచి మద్యం తాగి అతివేగంగా వస్తుండగా కలెక్టరేట్ సమీపంలో డివైడర్ ను ఢీకొనడంతో పల్టీలు కొట్టి అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు.
కుటుంబాలలో విషాదఛాయలు
మరో ఘటనలో గత సంవత్సరం నవంబర్ 7న కర్నూల్ రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వడ్డేపల్లి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోలో టమాటాల క్రేట్లను వ్యవసాయ పొలం నుంచి సమీపంలోని శాంతినగర్ మార్కెట్ కు తరలించారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రాయచూర్ నుంచి కర్నూలు మీదుగా తమిళనాడుకు వెళ్తున్న 2 ఆయిల్ ట్యాంకర్లు అందులో ఒక ట్యాంకర్ మరొకదానిని క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను గమనించకపోవడంతో వేగంగా ఢీకొనగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు మహేష్ (19), విశ్వాస్ (18) ఇద్దరూ చిన్న వయసు వారే కావడంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో బస్ కోసం వేచి యుండగా అతి వేగంగా బొలెరో వాహనం ఢీకొనడంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది.
Also Read: Municipal Elections: నోటిఫికేషన్ కోసం అధికారుల ఎదురుచూపులు.. మున్సిపాలిటీలలో ఉత్కంఠ

