Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో రోజుకో అవినీతి బాగోతం వెలుగు చూస్తోంది. తాజాగా వర్ధమాన క్రికెట్ ఆటగాళ్ల నుంచి డబ్బు డిమాండ్ చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఇద్దరు ప్లేయర్ల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సెలెక్షన్ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వర్ధమాన క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయటానికి హెచ్సీఏ ఆధ్వర్యంలో అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచులు జరిగే విషయం తెలిసిందే.
అయితే, ఈ మ్యాచుల్లో ఆటగాళ్లను ఆడించాలంటే తమకు డబ్బు చెల్లించాల్సిందే అంటూ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ హబీబ్ అహమద్ తోపాటు సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని మంచి ప్రదర్శన చేసినా తమ పిల్లలను లీగ్ మ్యాచుల్లో ఆడనివ్వలేదంటూ కోట రామారావు అనే వ్యక్తి బుధవారం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చారు. ఈ మేరకు హబీబ్ అహమద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 318(4), 318(2), 316(5) రెడ్ విత్ 3(5) ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
