India vs Pak Match: పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఆసియా కప్లో భాగంగా భారత్ – పాకిస్థాన్ జట్ల (India vs Pak Match) మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రైన్ టెన్ డొషేట్ ఆసక్తికరంగా స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలంటున్న భారతీయుల భావోద్వేగాలను తాము గౌరవిస్తామని చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశమని, ఆటగాళ్లు కూడా సామాన్యుల మాదిరిగా భావాలు, భావోద్వేగాలు అనుభవిస్తుంటారని చెప్పారు. కానీ, తాము బీసీసీఐ, భారత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని డొషేట్ స్పష్టం చేశారు. తమ పని క్రికెట్ ఆడటమేనని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్తో అన్ని రకాల క్రీడా సంబంధాలు విరమించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను మీడియా సమావేశానికి పంపలేదు. ఫీల్డింగ్ కోచ్ టెన్ డొషేట్ను పంపింది. అయినప్పటికీ, ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇటీవలే ఓ ప్రశ్నకు స్పందిస్తూ, క్రికెట్పై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Read Also- Donald Trump: రష్యా, చైనా టార్గెట్గా నాటో దేశాలకు ట్రంప్ షాకింగ్ సూచనలు
భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్ రైన్ టెన్ డొషేట్ మీడియాతో మాట్లాడారు. “ప్రజల భావోద్వేగాలు మాకు అర్థమవుతున్నాయి. కానీ మేము బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తున్నాం. క్రికెట్ మీదే దృష్టి పెట్టాలని మాకు చెప్పారు’’ అని చెప్పారు. క్రీడను రాజకీయాల నుంచి వేరుగా చూడాలని డొషేట్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వివాదం తలెత్తుందని తమకు ముందే తెలుసునని అన్నారు. ‘‘మన చేతిలో లేని విషయాలపై దృష్టి పెట్టకుండా, ఆట మీద దృష్టి పెట్టాలని గంభీర్ సందేశం ఇచ్చారు’’ అని డొషేట్ వివరించారు.
గంభీర్ అసలు వైఖరి ఇదే
టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ గతంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలు ఉండకూదని తన వైఖరిని స్పష్టం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా వ్యక్తిగతంగా ఇది నా స్పష్టమైన అభిప్రాయం. పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. అది క్రికెట్ అయినా, సినిమా లేదా ఇంకేదైనా సంబంధమైనా సరే. మన సైనికుల ప్రాణాలతో పోల్చితే ఇవన్నీ తక్కువే. దేశ భద్రత ముందు ఏదీ ముఖ్యం కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
Read Also- Hanumakonda Task Force: హనుమకొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీ మొత్తంలో నిషేధ గుట్కా స్వాధీనం