Ind vs Aus: మరోసారి వరుణుడే గెలిచాడు. భారత్ – ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా రద్దయింది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా మొదలైన ఈ మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టి 4.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 52 పరుగుల స్కోరు సాధించింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఎంతసేపటికీ వాన తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో, 2-1 తేడాతో సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఆరంభ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ను ఆస్ట్రేలియా, మరుసటి రెండు మ్యాచ్లను భారత్ వరుసగా గెలుచుకుంది.
ఓపెనర్స్ రఫ్పాడించారు
మ్యాచ్ రద్దయినప్పటికీ టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ దూకుడుగా ఆడి 4.5 ఓవర్లలోనే 52 పరుగులు బాదారు. 13 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 23 పరుగులు బాదాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక శుభ్మన్ గిల్ 16 బంతులు ఎదుర్కొని 29 రన్స్ సాధించాడు. మొత్తం 6 ఫోర్లు బాదాడు. సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్లోని 5 టీ20లు ఆడిన అభిషేక్ శర్మ 161.39 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.
Read Also- Ind vs Aus: భారత్-ఆసీస్ మధ్య 5వ టీ20 రద్దు.. సిరీస్ మనదే.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరికంటే?
ప్రజెంటేషన్ సెర్మనీలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని అందుకున్నాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచి టీమ్కు పదును పెడుతున్న తరుణంలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది.
అద్భుతంగా పుంచుకున్నాం: కెప్టెన్ సూర్య
ట్రోఫీ అందుకున్న అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సిరీస్లో 0-1తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి తిరిగి పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా ఆటగాళ్లందరికీ దక్కుతుందని, అందురూ అద్బుతంగా సహకరించారని చెప్పాడు. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ ఇది ఒక మంచి సిరీస్ అని సూర్య హర్షం వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఎవరి బాధ్యతలు వారికి చాలా బాగా తెలుసునని, బుమ్రా, అర్ష్దీప్ కలయిక ప్రమాదకరమైన కాంబినేషన్ అని పేర్కొన్నాడు. వారిద్దరి తర్వాత అక్షర్ పటేల్, వరుణ్ వచ్చి తమ వంతు పని పూర్తి చేశారని మెచ్చుకున్నాడు . చివరి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా అదరగొట్టాడని ప్రస్తావించాడు. జట్టులోని ఆటగాళ్లు ఇప్పటికే చాలా టీ20 క్రికెట్ ఆడారని, దీంతో జట్టుకు చాలా బలంగా మారారని మెచ్చుకున్నాడు. జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఒకరకంగా తలనొప్పేనని సరదా వ్యాఖ్య చేశాడు. స్వదేశంలో వరల్డ్ కప్నకు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి మూడు బలమైన జట్లతో ఆడటం ఒక గొప్ప సన్నాహకంగా నిలుస్తుందని చెప్పాడు. ఇటీవల భారత మహిళల జట్టు స్వదేశంలో ప్రపంచ కప్ గెలచిన తీరును తాను చూశానని, భారత క్రికెట్ అభిమానులు ఇచ్చిన మద్దతు నమ్మశక్యం కాని రీతిలో ఉందని సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.
Read Also- SSMB29 title glimpse: మూడు నిమిషాల విజువల్ కోసం వంద అడుగుల తెర.. ‘SSMB29’ కోసం ఆమాత్రం ఉంటది..
