Sensational Cases: గొర్రెల స్కాం.. ఫోన్ ట్యాపింగ్.. టానిక్ వైన్ షాపుల దందా.. అన్నీ సంచలనం సృష్టించిన కేసులే. అయితే.. ప్రతీ కేసులోనూ విచారణ పాత్రధారుల వరకే పరిమితమైంది. నెలలు గడిచి పోతున్నా ఏ ఒక్క కేసులోనూ దర్యాప్తు అధికారులు వీటిలో ఉన్న సూత్రధారులెవరన్నది తేల్చలేక పోతున్నారు. దీనిపై పోలీసు అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావాళ్లు గట్టిగా అనుకుంటే సూత్రధారుల బండారాన్ని బయట పెట్టటం అంత కష్టమేం కాదని కొందరు సీనియర్ పోలీసు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
వెయ్యి కోట్ల గొర్రెల స్కాం..
బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల రూపాయల వరకు స్కాం జరిగినట్టుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. గొల్లకురుమల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఈ స్కీంను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. దీని కోసం 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. 20 గొర్రెలు, ఒక పొట్టేల్ తో కూడిన యూనిట్ ధరను లక్షా 25వేల రూపాయలుగా నిర్ణయించింది. ఈ రేటుకు యూనిట్లు కొని లబ్దిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరి పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్(Moinuddin), అతని కుమారుడు ఇక్రముద్దీన్(Ikramuddin) లు స్కీంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత దీని స్వరూపమే మారిపోయింది. ప్రభుత్వ ఆమోదం లేకుండానే ఒక్కో యూనిట్ ధర లక్షా 25వేల నుంచి లక్షా 75వేలకు పెరిగింది. ధర పెంచినా పథకాన్ని సరిగ్గా అమలు చేశారా? అంటే అదీ లేదు. గొర్రెల విక్రయందారుల నుంచి యూనిట్లు కొని వారికి ఇవ్వాల్సిన డబ్బులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన ఏడుకొండలుతోపాటు మరికొందరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదులు చేయటంతో ఈ భారీ కుంభకోణం తీగ కదిలింది. వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తు మొదలు పెట్టిన ఏసీబీ అధికారులు దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈ క్రమంలో పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్ తోపాటు స్కీంలో నోడల్ ఆఫీసర్లుగా పని చేసిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టులు కూడా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో మనీలాండరింగ్ జరిగినట్టుగా ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించారు. లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని తేల్చారు.
Also Read; Warangal Drug Bust: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత!
పెద్దల ప్రమేయం..
ఈ కుంభకోణంపై ఓ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడగా దీంట్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కొందరి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కాంట్రాక్టర్ కలిసి వెయ్యి కోట్ల రూపాయలను స్వాహా చేయటం అసాధ్యమని అభిప్రాయ పడ్డారు. అయితే, ఈ కేసులో విచారణ జరుపుతున్న ఏసీబీగానీ…ఈడీగానీ ఇప్పటివరకు గొర్రెల కుంభకోణంలో ఉన్న బడా బ్లాక్ షీప్స్ ఎవరన్నది తేల్చలేకపోయారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ స్కాంలో కీలకపాత్ర వహించిన ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ లను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ..
ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పరిస్థితి కూడా ఇదే. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు పర్యవేక్షణలో డీఎస్పీ ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్ర నేతలతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లోని కీలక నేతలు పోటీ చేసిన స్థానాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బంధుమిత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ సంభాషణలు రికార్డు చేసిన హార్డ్ డిస్కులు, ఇతర కీలక ఆధారాలను ధ్వంసం చేశారు. వాటిని మూసీ నదిలోకి విసిరేశారు. కాగా, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే, రెండేళ్లు గడిచిపోతున్నా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్నది తేల్చలేక పోతున్నారు. అదేమంటే ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్
స్వయంగా కేసీఆర్ వినిపించినా..
అయితే, ఈ కేసులో కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశమున్నా ఆ దిశగా సిట్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో? అర్థం కావటం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన నందకుమార్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఇదే కేసులో పట్టుబడ్డ సింహయాజీ స్వామితో మాట్లాడిన ఫోన్ సంభాషణలను అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరీ వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ టేపులు కేసీఆర్ చేతికి ఎలా వచ్చాయి? అన్నదానిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగిందని చెప్పారు. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి తాను నందకుమార్ మాట్లాడినపుడు సంభాషణను రికార్డు చేసినట్టుగా చెప్పారన్నారు. ఇది నిజమే అనుకున్నా సింహయాజీ స్వామితో మాట్లాడిన మాటల టేపు ఎలా బయటకు వచ్చింది? …అది కేసీఆర్ వద్దకు ఎలా చేరింది? అన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ జవాబు దొరకలేదన్నారు. ట్యాపింగ్ కేసులో పదుల మందిని సిట్ కార్యాలయానికి పిలిపించి వాంగ్మూలాలు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు నందకుమార్ నుంచి ఎందుకు స్టేట్ మెంట్ తీసుకోలేదో? తనకైతే అర్థం కావటం లేదన్నారు.
Also Read: Raghunandan Rao: కేటీఆర్ ఓటమికి హరీష్ రూ.60 లక్షలు పంపింది నిజం!
టానిక్ కేసులోనూ..
వందల కోట్ల రూపాయల టాక్స్ ను ఎగ్గొట్టిన ఎలైట్ లిక్కర్ మార్ట్ టానిక్ కేసులోనూ ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2016లో టెండర్లు పిలవకుండా…లక్కీ డ్రా తీయకుండా ఒకే ఒక్క జీవో (నెంబర్ 271) జారీ చేసి టానిక్ యాజమాన్యానికి ఎలైట్ లిక్కర్ మార్ట్ ను కట్టబెట్టారు. అంతటితో ఆగారా? అంటే అదీ లేదు. ప్రతీ అయిదు సంవత్పరాలకు ఒకసారి లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే వెసులుబాటును ఈ జీవో ద్వారా కల్పించారు. మొదటి మూడేళ్లు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు చెల్లించే అవకాశం లేదంటూ మినహాయింపును కూడా ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే టానిక్ బేవరెజెస్ మాత్రమే టెండర్ కోట్ చేయటం. ఇక, తెలంగాణలో ఒకే ఒక్క ఎలైట్ లిక్కర్ మార్ట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా టానిక్ బేవరెజెస్ క్యూ బై టానిక్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లోనే పది షాపులు నడిపింది. టానిక్ మెయిన్ బ్రాంచ్ లో పని చేసే ఓ ఉద్యోగి పేర ఫారిన్ లిక్కర్ లైసెన్స్ తీసుకుని అన్ని దుకాణాల్లో విదేశీ మద్యం అమ్మకాలు సాగించింది.
వెనక ఉన్నది ఎవరు?
ఆరేళ్లపాటు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా వందల కోట్లు వెనకేసుకుంది. అయినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం టానిక్ బేవరెజెస్ కు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీ ఆశీర్వాదాలు ఉండటమే అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతోపాటు అప్పటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన బడా అధికారుల పిల్లలకు దీంట్లో భాగస్వామ్యం ఉండటం కూడా మరో కారణం. ఈ కేసులో ఎక్సయిజ్ అధికారులు టానిక్ ఎలైట్ లిక్కర్ మార్ట్ షాపుల్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న వరకు విచారణ జరిపారు.. తప్పితే ఎవరి అండతో ఒకే ఒక్క టెండర్ వచ్చినా జీవో జారీ చేసి ఈ లిక్కర్ మార్టులను టానిక్ బేవరెజెస్ కు కట్టబెట్టటం వెనక ఉన్నది ఎవరు? అన్నది తేల్చలేక పోయారు. ప్రస్తుతం ఈ కేసును అధికారులు సైతం మరిచి పోవటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే ఇప్పటికీ కొందరు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని కొందరు సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. కాస్త గట్టిగా అనుకుంటే సంచలనం సృష్టించిన ఈ కేసుల్లో అసలు సూత్రధారులు ఎవరన్నది బయట పెట్టటం పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read; Allu Arjun: మొత్తానికి మరోసారి మల్లు అర్జున్ అనిపించుకున్నాడుగా!