Donald Trump: అధిక టారిఫ్ల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు అత్యంత సున్నితంగా మారిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా తనకు అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడైన సెర్జియో గోర్ ( Sergio Gor) అనే తోటి సీనియర్ పొలిటీషియన్ను భారత్కు అమెరికా రాయబారిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన వెలువడింది. ‘‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివసించే ప్రాంతానికి నన్ను పూర్తిగా విశ్వసిస్తూ, నా అజెండాను నెరవేర్చే, మనకు సాయపడే వ్యక్తి చాలా ముఖ్యం. సెర్జియో కచ్చితంగా అసాధారణమైన రాయబారి అవుతారు. అమెరికాను మనం మళ్లీ గొప్ప దేశంగా నిలబెడదాం!’’ అంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ప్రకటించారు.
ఎవరీ గోర్?
గోర్ ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు. కన్సర్వేటివ్ పార్టీలో ఆయన అనతికాలంలో శక్తిమంతమైన రాజకీయ నేతగా ఎదిగారు. వైట్ హౌస్లో దాదాపు 4,000 మంది నియామకాల్ని ఆయనే పరిశీలించారంటే ఎంత ప్రభావవంతమైన శక్తి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, ఒదిగి ఉంటారు. ట్రంప్ పట్ల అత్యంత విధేయతను ప్రదర్శిస్తుంటారు.
సెర్జియో గోర్కు ఉన్న శత్రువుల్లో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారని అమెరికా పాలిటిక్స్ చెప్పుకుంటున్నారు. ట్రంప్తో విభేదాల కారణంగా ఎలాన్ మస్క్ ఇటీవలే కన్సర్వేటివ్ పార్టీకి, ట్రంప్కి దూరమయ్యారు. ప్రభుత్వం నుంచి నిష్క్రమించే క్రమంలో ‘గోర్ ఒక పాము’ అంటూ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాసాకు తాను నాయకత్వం వహించకుండా, తన ఎంపికకు గోర్ అడ్డుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. విదేశాంగ విధానంలో గోర్కు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ, విదేశీ పర్యటనల్లో పాల్గొనడం, జాతీయ భద్రతా మండలి సిబ్బందిలో సందేహాస్పదంగా అనిపించే వ్యక్తులను తొలగించడం వంటి కొన్ని అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
Read Also- Bharatiya Antariksh Station: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనా విడుదల
దక్షిణాసియా వ్యవహారాలు కూడా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం చూస్తే, సెర్జియో గోర్ కేవలం భారత రాయబారి మాత్రమే కాదు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక దౌత్య ప్రతినిధిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. వాస్తవానికి, సాంప్రదాయక దౌత్యవేత్తలను డొనాల్డ్ ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తన వ్యక్తిగత మిత్రుల ఆధారంగా దౌత్య సంబంధాలను నడుపుతున్నారు. దానికితోడు, దక్షిణాసియా వ్యవహారాలకు సంబంధించిన అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత స్థాయి పదవి ఖాళీగానే ఉంది. అందుకే, సెర్జియో గోర్ను ఆయన నియమించారు.
కాగా, అమెరికా-భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. 1990ల నుంచి భారత్ను కీలక భాగస్వామిగా పరిగణించడం అమెరికా మొదలుపెట్టింది. ఆ దిశగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అయితే, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోతున్న ట్రంప్.. భారత్ను పావుగా వాడుకోవాలనుకున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నారంటూ భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి పెంచారు. తద్వారా రష్యాను దారిలోకి తెచ్చుకోవచ్చని భావించారు.
Read Also- Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం