UP Principal: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్ 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక పట్ట అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు భార్యగా ఉంటే పరీక్షల్లో పాస్ చేస్తానని.. లేదంటే ఫెయిల్ కాక తప్పదని బెదిరించాడు. అంతేకాదు పలుమార్లు లైంగికంగానూ వేధించాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని అలీగఢ్ జిల్లా తాలిబ్నగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ షకీల్ అహ్మద్ (50 ఏళ్లు)పై 11 ఏళ్ల 7వ తరగతి విద్యార్థిని లైంగిక ఆరోపణలు చేసింది. తనను అసభ్యంగా తాకడంతో పాటు ప్రతిఘటిస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడని తల్లికి చెప్పింది. లవ్ లెటర్స్ కూడా రాశాడని వాపోయింది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రిన్సిపల్ చెప్పాడని తల్లి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బాలిక తల్లి తక్షణమే అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏడుస్తూ ఇంటికొచ్చిన బాలిక
ఆగస్టు 23 సాయంత్రం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆందోళనగా ఉన్న బిడ్డను చూసి ఏమైందని తల్లి ప్రశ్నించగా జరిగిందంతా బాలిక చెప్పింది. వెంటనే తల్లి జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ప్రజలు కూడా ఈ సంఘటనపై షాక్కు గురై ప్రిన్సిపల్ అహ్మద్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల్లో పిల్లల భద్రతకు బలమైన చర్యలు అవసరమని పట్టుబడుతున్నారు.
Also Read: Kailasagiri Skywalk: చైనా ఎందుకు దండగ.. మన వైజాగ్ ఉండగా.. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ అయ్యిందోచ్!
ప్రిన్సిపల్పై కఠిన చర్యలు
జిల్లా ప్రాథమిక విద్యాధికారి డా. రాకేష్ కుమార్ సింగ్ ఘటనపై స్పందిస్తూ ప్రిన్సిపల్ అహ్మద్ను వెంటనే సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు. అధికారిక దర్యాప్తు అనంతరం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. మరోవైపు పోలీసులు సైతం షకీల్ అహ్మద్ను రిమాండ్లోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చట్ట ప్రకారం బాలికకు వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులకు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనతో బాలిక కుటుంబం తీవ్ర మానసిక వేదనలో కుంగిపోయింది. దీంతో కౌన్సెలింగ్, లీగల్ సపోర్ట్ వంటి రక్షణ చర్యలు అందించేందుకు యూపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
Also Read: Hanuman Lord: హనుమాన్ కిందకి దిగి వచ్చాడు.. ఇదిగో ప్రూఫ్.. దేవుడని మొక్కి పూజలు మొదలు పెట్టండి ఇక?
విద్యార్థుల సంరక్షణపై ప్రశ్నలు
ఈ దారుణ ఘటన విద్యాసంస్థల్లో బాలికల సంరక్షణపై ఆందోళనలను లేవనెత్తింది. స్కూళ్లల్లో పిల్లలు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను రక్షించాల్సిన స్థానంలో ఉన్నవారు అధికారం దుర్వినియోగం చేయడాన్ని ది లాజికల్ ఇండియన్ తీవ్రంగా ఖండించింది. బాలల హక్కులు, గౌరవం కాపాడటంలో రాజీపడాల్సిన పనే లేదని పేర్కొంది.