F-35B Jet: సాంకేతిక సమస్యతో నెల రోజుల కిందట కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్-35బీ (F-35B Jet) స్టెల్త్ యుద్ధ విమానం ఎట్టకేలకు కదిలింది. మరమ్మతులు విజయవంతంగా పూర్తికావడంతో మంగళవారం ఉదయం విమానం గాల్లోకి ఎగిరింది. విమానంలో హైడ్రాలిక్ లోపం తలెత్తింది. తొలుత వచ్చిన బృందం పలు పరిశీలనలు చేసిన తర్వాత, జులై 6న యూకే నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రత్యేక నిపుణుల బృందం మరమ్మతులు విజయవంతంగా పూర్తి చేసింది. కట్టుదిట్టమైన కెమెరా పర్యవేక్షణలో రిపేర్ పనులు ముగిసిన తర్వాత, అన్ని పరీక్షలు నిర్వహించారు. విమానం ఫిట్గా ఉన్నట్టు నిర్ధారించి తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చారు. కాగా, ఎఫ్-35బీ యుద్ధ విమానం జూన్ 14న అత్యవసర ల్యాండింగ్ అయింది.
విమానం బయలుదేరి వెళ్లినట్టు బ్రిటిష్ హైకమిషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘జూన్ 14న అత్యవసర కారణాలతో ల్యాండ్ అయిన యూకేకి చెందిన ఎఫ్-35బీ యుద్ధవిమానం, ఇవాళ (మంగళవారం) తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. జులై 6 నుంచి మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉన్న యూకే ఇంజినీరింగ్ బృందం అన్ని భద్రతా పరీక్షలు పూర్తిచేసి, విమానాన్ని తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చింది. భారత అధికారులకు, ఎయిర్పోర్టు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అంటూ బ్రిటిష్ హైకమిషనర్ ప్రతినిధి పేర్కొన్నారు.
Read Also- Dhankhar: ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. మోదీ ఏమన్నారంటే
కాగా, ఎఫ్-35బీ ఐదవ తరం స్టెల్త్ యుద్ధవిమానం. యూకేకు చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్లో (యుద్ధ నౌక) దీనిని మోహరించి ఉంచుతారు. భారత నౌకాదళంతో బ్రిటిష్ నౌకాదళం ఇటీవల చేసిన సముద్ర యుద్ధాభ్యాసాల్లో కూడా ఎఫ్-35బీ ఫైటర్ జెట్ పాల్గొంది. ఈ విమానం యూకే నుంచి ఆస్ట్రేలియాకు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంధన స్థాయి, అధిక వర్షంతో ప్రతికూలంగా మారిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని విమానాన్ని తిరువనంతపురం మళ్లించారు. భారత వాయుసేనకు అప్పటికే సమాచారం ఇవ్వడంతో తిరువనంతపురం ఎయిర్పోర్టులో దిగేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Read Also- Honeymoon Murder case: నెల రోజులుగా జైల్లోనే.. అయినా బుద్ధిరాలేదు.. తోటి ఖైదీలతో సోనమ్ ఏం చేసిందంటే?
ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని తిరిగి యూకేకి బ్రిటిష్ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలించలేదు. ఒకానొక దశలో సీ-17 గ్లోబ్మాస్టర్ అనే కార్గో విమానంలో ఎఫ్-35బీని తరలించాలని భావించారు. అయితే, ప్రత్యేక నిపుణుల బృందం, రిపేరింగ్కు కావాల్సిన పరికరాలను తీసుకొని జులై 6న తిరువనంతపురం వచ్చారు. విమానాన్ని హ్యాంగర్కి తీసుకెళ్లి రిపేర్ పనులు ప్రారంభించారు. భారతదేశంలో ఎఫ్-35బీకి సంబంధించిన మౌలిక వసతులు ఏమీ లేకపోవడంతో యూకే నుంచి తెప్పించాల్సి వచ్చింది. ప్రత్యేక పరికరాలతో పాటు మొత్తం 24 మంది నిపుణుల బృందం ఇక్కడికి వచ్చింది.
కాగా, ఎఫ్-35బీ యుద్ధ విమానాన్ని కేరళ ఎయిర్పోర్టులో 35 రోజులపాటు పార్కింగ్ చేయడంతో రూ.9 లక్షలకు పైగా పార్కింగ్, ల్యాండింగ్ ఫీజు అయ్యిందంటూ ఎకనామిక్స్ టైమ్స్లో ఒక కథనం ప్రచురితమైంది. పార్కింగ్ ఫీజు రోజుకు రూ.26,000 పైగా అయ్యింది.