Shubhanshu Shukla: భారత అంతరిక్ష వ్యోమగామి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం, గురువారం సాయంత్రం 4.45 గంటలకు యాక్సియం-4 మిషన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగింది. శుభాంశు శుక్లాతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములతో కూడిన ‘క్రూ డ్రాగన్ క్యాప్సూల్’ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అయ్యింది. శుభాంశు శుక్లా పైలట్గా ఉన్న ఈ వాహక నౌక ఏకంగా 28 గంటల నిరంతరాయ ప్రయాణం తర్వాత ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం నుంచి 424 కి.మీ ఎత్తులో ఈ డాకింగ్ ప్రక్రియ జరిగింది.
Read this- Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?
అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో ప్రయాణించి అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమయ్యే ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. అంతరిక్ష నౌక, అంతరిక్ష కేంద్రం రెండూ ఒకే కక్ష్యలో ప్రయాణించాలి. నిర్దిష్ట వేగం, దిశలో ప్రయాణించి ఒకదానికొకటి సమీపించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కక్ష్యలో ప్రయాణించిన వాహన నౌక ఐఎస్ఎస్కు అనుసంధానం అయ్యింది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగింది. ఏర్పాటు చేసిన కనెక్షన్ ద్వారా వ్యోమగాములతో పాటు సరుకులను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు.
Read this- Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం ఇదే
భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 4.03 గంటలకు మిషన్ కంట్రోల్ ‘సాఫ్ట్ క్యాప్చర్’ను నిర్ధారించింది. అంటే, అంతరిక్ష నౌక గతిశక్తిని గ్రహించి దానితో కనెక్షన్ ఏర్పరచుకునేందుకు స్పేస్ స్టేషన్ అనుమతి ఇచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత ‘హార్డ్ క్యాప్చర్’ జరిగింది. అంతరిక్ష నౌక వెళ్లి ఐఎస్ఎస్తో బలంగా కనెక్ట్ అయ్యింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోజ్ విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టారు. అయితే, ఇప్పటికే ఐఎస్ఎస్లో పరిశోధనలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యోమగాములతో ఈ బృందం వెంటనే కలవదు. వ్యోమగాముల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేకుండా అన్ని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. స్పేస్ స్టేషన్తో కనెక్షన్ను స్థిరీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు శుభాంశు శుక్లా బృందం ఎదురుచూడాల్సి ఉంటుంది.
శుక్లా ఏం చదివారు?
భారత వ్యోమగామి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ టెస్ట్ పైలెట్ అయిన శుభాంశు శుక్లా చదువు లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్లో మొదలైంది. 1998లో కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే, దేశానికి సేవ చేయాలనే బలమైన సంకల్పం ఆ సమయంలో పురుడు పోసుకుంది. దృఢ సంకల్పాన్ని పూనుకున్న ఆయన, తన కుటుంబానికి తెలియజేయకుండా యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు అప్లికేషన్ పెట్టారు. ఎంతో సంక్లిష్టంగా ఉండే ఆ పరీక్షలో పాసయ్యారు. 2005లో ఎన్డీఏ నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని కూడా ఆయన చదివారు. ఆ తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానం నడపంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2006లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు నడిపేందుకు అధికారికంగా నియమితులయ్యాయి.