Nuclear weapons: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతనానికి పర్యాయపదంలా అనిస్తుంటారు. టారీఫ్ వార్ పేరిట కొంతకాలం, యుద్ధాలు ఆపేస్తున్నాను ‘నోబెల్ పీస్ ప్రైజ్’ గ్యారంటీగా వస్తుందంటూ మరికొంతకాలం నానాహంగామా చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం అణ్వాయుధాల మీద (Nuclear weapons) పెట్టినట్టుగా అనిపిస్తోంది. పాకిస్థాన్, చైనా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, అలాగే రష్యా, ఉత్తర కొరియా కూడా తమ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తున్నాయంటూ ఆదివారం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీల నివేదికలను ఆయన పేర్కొన్నారు. తద్వారా 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను పరీక్షించాలంటూ అమెరికన్ బలగాలకు తాను ఇచ్చిన ఆదేశాలను ఆయన సమర్థించుకున్నారు. మరి, డొనాల్డ్ ట్రంప్ మాటలే నిజమైతే.. సరిహద్దుకు ఇరువైపుల ఉన్న పాకిస్థాన్, చైనా అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే భారత్ కలవరపడాలా?, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి?, అసలు భారత్ ఎప్పుడు, ఎందుకు అణ్వాయుధాల పరీక్షలను ఆపివేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్కు ముప్పే!
భారత్కు రెండు సరిహద్దుల్లో ఇటు పాకిస్థాన్, అటు చైనాలతో ఇప్పటికే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలు పరీక్షిస్తున్నారనే పరిణామం ఆందోళనకరమైనేదేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు దేశాలు అణ్వాయుధాలను పరీక్షించడం లేదా, వాటిని డెవలప్ చేయడం భారత భద్రతకు నిరంతర ఆందోళన కలిగించే అంశంగా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనా సైనిక, ఆర్థిక మద్దతుతో పాకిస్థాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆధునికీకరిస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం తన అస్తిత్వానికి ముప్పు అని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. అందుకే, స్వల్ప, మధ్య శ్రేణి మిసైల్స్ను అభివృద్ధి చేస్తోందనేది నివేదికల సారాంశం. పాక్ ఈ విధంగా అణ్వాయుధాలను తయారు చేయడం భారత్కు ప్రధానమైన సవాలుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also- Dreams: చెడు కలలు ఎందుకు వస్తాయి? శాస్త్రవేత్తలు బయటపెట్టిన నిజాలివే!
భారత్ అణుబాంబుల తయారీని ఎందుకు ఆపేసింది?
అణ్వస్త్ర దేశాలలో ఒకటైన భారత్ 1998లో పోఖ్రాన్-2 (ఆపరేషన్ శక్తి) ద్వారా అణ్వాయుధాన్ని పరీక్షించింది. ఆ పరీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. 2025 నాటికి మన దేశం వద్ద 180 వరకు అణు వార్ హెడ్స్ ఉన్నట్టు అంచనాగా ఉంది. అయితే, ఫోఖ్రాన్-2 పరీక్ష అనంతరం భారత్ తాను అనుసరించబోయే అణు సిద్ధంతాన్ని ప్రకటించింది. ఏ దేశంపైనా ‘మొదటి దాడి చేయము’ (No First Use) అనే కీలకమైన సిద్ధాంతాన్ని ప్రపంచానికి స్పష్టం చేసింది. దీనిర్థం అణ్వాయుధాలు లేని దేశంపై మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ తమ దేశంపై, లేదా తమ బలగాలపై ఏ దేశమైనా అణ్వాయుధాలతో దాడి చేస్తే, ప్రతీకారంగా, భారీ స్థాయిలో అణ్వాయుధాలతో విరుచుకపడతామని హెచ్చరించింది.
శత్రుదేశాలను భయపెట్టడానికి, మన దేశాన్ని రక్షించుకోవడానికి అణ్వాయుధాలు కనీస సంఖ్యలో ఉంటే సరిపోతాయని భారత్ భావిస్తోంది. తద్వారా అంతర్జాతీయంగా దేశానికి విశ్వసనీయతను పెంచాలనేది లక్ష్యంగా ఉంది. అందుకే, అదనంగా అణుబాంబుల తయారీకి అవసరమైన పరీక్షలు చేయడంలేదు. సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ , 1998లో పోఖ్రాన్-2 పరీక్షలు పూర్తైన తర్వాత అణ్వాయుధ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ‘సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం’ ప్రధాన లక్ష్యం ప్రకారం, ఏ దేశమైనా అణు పరీక్షలను శాశ్వతంగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై సంతకం చేయకపోయినా భారత్ స్వచ్ఛందంగా పాటిస్తోంది. అణ్వాయుధాల పరీక్షలు, పెద్ద ఎత్తున నిరంతరం బాంబులను తయారీ ఎంతో వ్యయంతో కూడుకున్న పని. దీంతో, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం భారత లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. బాంబుల తయారీకి పెట్టాల్సిన నిధులను అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగిస్తోంది.
మొత్తంగా, అణ్వాయుధాల విషయంలో భారతదేశం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించుకుంది. అయితే, శాంతి సిద్ధాంతానికి కట్టుబడి కొనసాగుతోంది. దేశ భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే భారత్ మళ్లీ అణ్వాయుధాలను పరీక్షించాల్సి అవసరంపై దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు.
