India on Pak Army Chief: అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ (Pakistan Army Chief Asim Munir).. భారత్ సహా ప్రపంచ దేశాలకు అణు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Govt) దీనిపై స్పందించింది. పాక్ సైన్యాధికారి చేసిన అణు యుద్ధ హెచ్చరికను తీవ్రంగా ఖండించింది. అణ్వాయుధాలతో భయపెట్టడం పాకిస్థాన్ సహజ స్వభావమని పేర్కొంది. స్నేహపూర్వకమైన మూడో దేశం నేలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
‘ప్రపంచం అర్థం చేసుకోవాలి’
అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ పాల్గొని మాట్లాడారు. పాక్ నాశనమయ్యే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని విధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అటు సింధూ జలాల ఒప్పందం (Sindhu Waters Treaty) నుంచి భారత్ తప్పుకోవడం, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వంటి అంశాలపైనా ఆసీం.. అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ (India Foreign Ministry) దీనిపై అధికారికంగా స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. ‘ఆసీం మునీర్ వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న బాధ్యతారాహిత్యాన్ని అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలి. ఉగ్ర గ్రూపులతో సైన్యం కలిసిమెలిసి నడిచే దేశంలో అణ్వాయుధాల పర్యవేక్షణ, విశ్వనీయతపై అనుమానాలను ఇది మరింత బలపరుస్తోంది’ అని విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది.
‘బెదిరింపులకు తలొగ్గబోము’
పాక్ ఆర్మీ చీఫ్ చేసిన అణు బెదిరింపులకు భారత్ ఎట్టిపరిస్థితుల్లో తలొగ్గబోదని.. జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా మద్దతు ఉన్నప్పుడల్లా పాకిస్తాన్ సైన్యం తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుందని కేంద్రం పేర్కొంది. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ వ్యాఖ్యలు.. పాకిస్థాన్ ను అణు ఆయుధాలు కలిగిన బాధ్యతారాహిత్యమైన దేశంగా చూపుతున్నాయి. అక్కడి అణ్వస్త్రాలు అసంస్థాగత శక్తుల చేతుల్లో పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేనిదాని చెప్పేందుకు సంకేతం. అక్కడ సైన్యం పాలనను నడుపుతుంది’ అని విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Rajasthan: బాల్కనీ నుంచి దూకేసిన నవ వధువు.. వెలుగులోకి కళ్లు బయర్లుకమ్మే నిజాలు!
పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?
అంతకుముందు పాక్ సైన్యాధిపతి ఆసీం మునీర్ మాట్లాడుతూ ‘మేము అణు శక్తి గల దేశం. మేము పతనమవుతున్నామని భావిస్తే ప్రపంచంలో సగభాగాన్ని మాతో పాటు నాశనం చేస్తాము’ అని హెచ్చరించారు. పాక్ తో కుదుర్చుకున్న సింధు నది ఒప్పందం నుంచి భారత్ తప్పుకోవడంపైనా ఆయన మాట్లాడారు. సింధు నది జలాలపై భారత్ నిర్మించబోయే ప్రాజెక్ట్స్.. పాకిస్థాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే వాటిని నాశనం చేస్తామని బెదిరించారు. తమ దేశానికి క్షిపణుల కొరత లేదని వాటితో ఆయా ప్రాజెక్ట్స్ ను కూల్చివేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attacks) తర్వాత ఇండస్ వాటర్స్ ఒప్పందం (Indus Water Treaty)పై న్యూ ఢిల్లీ తీసుకున్న నిర్ణయం 250 మిలియన్ల మందిని ఆకలి సంక్షోభంలోకి నెట్టిందని మునీర్ పేర్కొన్నారు.