Kedarnath Helicopter Crash: కేదార్ నాథ్ యాత్ర.. హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే యాత్ర. జీవితంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్లాలని ప్రతి ఒక్క హిందువు కోరిక. హిమాలయ శిఖరాల్లో కొలువైన శివయ్యను కనులారా చూడాలని పరితపిస్తుంటారు. అయితే, వరుస హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నే అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటన మరువకముందే, తాజాగా గౌరీకుండ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు.
తెల్లవారుజామున విషాదం
ఆదివారం ఉదయం హెలికాప్టర్ కేదార్నాథ్ నుంచి బయలుదేరింది. అందులో ఏడుగురు ఉన్నారు. తర్వాత కూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్, త్రియుగినారాయణ మధ్య జరిగింది. ఉదయం 5.20 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని హెలికాప్టర్ ముందుకు వెళ్లలేక కుప్పకూలిందని భావిస్తున్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఆర్యన్ ఏవియేషన్కు చెందిన ఈ హెలికాప్టర్, కేదార్నాథ్ నుండి గుప్తకాశీ వైపు వెళ్తున్నది. గాలిలో ఉండగా సంబంధాలు తెగిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత, సోన్ప్రయాగ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు నివేదికలు వచ్చాయి. స్థానికులు అడవిలో మంటలు, పొగ రావడం గమనించారని చెప్పారు.
ప్రయాణికుల వివరాలు
కెప్టెన్ రాజ్బీర్ సింగ్ చౌహాన్ – పైలట్ (జైపూర్)
విక్రమ్ రావత్ – ఉఖిమఠ్ నివాసి, ఉత్తరాఖండ్
వినోద్ దేవి (66) – ఉత్తర ప్రదేశ్
త్రిష్టి సింగ్ (19) – ఉత్తర ప్రదేశ్
రాజ్కుమార్ సురేష్ జైస్వాల్ (41) – గుజరాత్
శ్రద్ధా రాజ్కుమార్ జైస్వాల్ – మహారాష్ట్ర
కాశీ (2) – మహారాష్ట్ర
ప్రాథమిక నివేదికల ప్రకారం, మృతులు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లకు చెందినవారుగా తేలింది. వారి పూర్తి వివరాలను ధృవీకరించి, కుటుంబాలకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం ధామీ దిగ్భ్రాంతి.. రెస్క్యూకు ఆదేశం
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసి నేను తీవ్రంగా కలత చెందాను. అందరి ప్రయాణికుల భద్రత కోసం బాబా కేదార్ను ప్రార్థిస్తున్నాను. ఎస్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి” అని తెలిపారు.
Read Also- Gold Rate ( 15-06-2025): అతి భారీగా పెరిగి షాక్ ఇచ్చిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?
రెస్క్యూ, దర్యాప్తు ప్రారంభం
విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) ప్రకారం, ఈ ప్రమాదానికి వాతావరణ మార్పులే కారణమని తేల్చారు. కచ్చితమైన కారణాన్ని దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
వరుస ఘటనలతో భయాందోళనలు
ఈ మధ్య కేదార్ నాథ్ రూట్లో హెలికాప్టర్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు అత్యవసరంగా హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకటి ప్రమాదానికి గురైనది.
మే 8
ఉత్తర కాశీలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఒకరు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం ఏడుగురు ఉన్నారు.
మే 13
బద్రీనాథ్ నుంచి భక్తులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉఖిమత్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
జూన్ 7
కేదార్ వ్యాలీ నుంచి కేదార్ నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో గౌరీకుండ్ రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, రోడ్డుపై ఆపి ఉన్న కారు, సమీపంలోని షాపు దెబ్బతిన్నాయి. అదే రోజు క్రిస్టల్ ఎయిర్ లైన్స్కు చెందిన హెలికాప్టర్లో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ సమయంలో వెనుక భాగం విరిగింది. తాజా ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also- Kannappa: కన్నప్ప ట్రైలర్లో ఈ ఐదు విషయాలే హైలైట్.. మీరూ గమనించారా?