Delhi Car Blast: ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. ఈ దాడి కేవలం ఒకే ఒక్క సంఘటన కాదని, పాకిస్థాన్ మద్దతుగల ఉగ్ర సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) సుదీర్ఘ, పకడ్బందీ ప్రణాళికలో ఇది భాగమని తేలింది. నిందితుల విచారణలో భాగంగా, ఈ ఆపరేషన్కు వారు అంతర్గతంగా ‘డీ6’ అనే కోడ్ను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
2021లో కుట్రకు బీజం..
ఈ కుట్ర 2021లోనే ప్రారంభమై, భారతదేశంలోని ఆరు నగరాలకు విస్తరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్లో ప్రధాన సూత్రధారుల్లో డాక్టర్ షాహీన్ సయీద్ (43)ను గుర్తించారు. ఈమెను ఉగ్రవాదులు ‘మేడమ్ సర్జన్’గా పిలిచేవారు. ఉన్నత విద్యావంతురాలైన షాహీన్ను ఉగ్రవాద భావజాలంతో ప్రభావితం చేసి, జేఈఎం తన మాడ్యూల్లోకి చేర్చుకుంది. ఆమె తన వైద్య వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి ఇతర వృత్తి నిపుణులను (డాక్టర్లు, మత పెద్దలు) రిక్రూట్ చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
హవాలా మార్గంలో నిధులు
అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీల్లో ఉగ్రవాదులు తాము అమలు చేయాలనుకున్న ‘డీ6 మిషన్’ గురించి స్పష్టంగా రాసుకున్నారు. ఈ డైరీల్లో లక్ష్యాల ఎంపిక, రిక్రూట్మెంట్లు, హవాలా మార్గం ద్వారా నిధుల తరలింపు, సురక్షితమైన కమ్యూనికేషన్ పద్ధతులపై వివరణాత్మక చర్చలు ఉన్నాయి. పేలుడుకు అవసరమైన సుమారు రూ.20 లక్షల నిధులను హవాలా మార్గం ద్వారా జేఈఎం హ్యాండ్లర్ నుంచి అందుకున్నట్లు గుర్తించారు. ఈ నిధులను సేఫ్ హౌస్లు, కమ్యూనికేషన్ పరికరాలు, నిఘా కోసం ఖర్చు చేశారు. డా. ముజామ్మిల్, ఉమర్, డా. షాహీన్ షాహిద్లు 2021లోనే ఈ మిషన్ కోసం ప్రణాళికలు ప్రారంభించారు.
ప్లాన్ ఫెయిల్..
ఢిల్లీ పేలుడు కేసులోని నిందితులు, అనుమానితులు ఢిల్లీ, లక్నో, ఫరీదాబాద్తో సహా మొత్తం ఆరు నగరాల్లో చురుకుగా కదలికలు జరిపారు. పేలుడు జరిగిన తర్వాత డాక్టర్ షాహీన్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే, పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో ఆమె ప్లాన్ విఫలమైంది. ఈ కీలక నిందితులు 2010 నుంచే తీవ్రవాద భావజాలానికి గురై, 2015-2016 నాటికి జేఈఎం వర్గాలలో చేరారు. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పుడు డాక్టర్ షాహీన్ తీవ్రంగా స్పందించిందని, ‘నేను నా కోసం బ్రతికింది చాలు, ఇక నా సమాజం రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చింది’ అని చెప్పినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Hidma Encounter: భారీ ఎన్ కౌంటర్.. కరుడుగట్టిన మావోయిస్టు హిడ్మా హతం
బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారం
ప్రస్తుతం నిందితులందరూ కస్టడీలో ఉండటంతో, దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్రవాద మాడ్యూల్ పూర్తి ఆపరేషనల్ విధానాన్ని పునర్నిర్మిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు అనేది ఒక సుదీర్ఘమైన, పాకిస్థాన్ మద్దతుగల తీవ్రవాద ప్రాజెక్ట్లో భాగమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్ర మాడ్యూల్ లక్ష్యం డిసెంబర్ 6నే కావడం వెనుక బలమైన కారణం ఉంది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే వారు ఈ తేదీని ఎంచుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఆపరేషన్ కోసం ముందస్తు సన్నాహాలుగా, ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

