Satyameva Jayate Slogans: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పార్లమెంటు ముఖద్వారం వద్ద సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. పార్లమెంటు ఆవరణలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బీజేపీ కుట్రలు తేటతెల్లం: చామల
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), ఇందిరా గాంధీ (Indira Gandhi)పై కేంద్రంలోని బీజేపీ (BJP) చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఈ ధర్నా చేపట్టినట్లు భువనగిరి లోక్ సభ ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. ఈడీ (ED), సీబీఐ (CBI), ఇన్ కమ్ ట్యాక్స్ (IT), ఈసీ (Election Commission of India) లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన అవసరానికి వాడుకుంటోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో రాహుల్, సోనియాలకు సంబంధం లేదని తొలి నుంచి చెబుతున్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చామల పేర్కొన్నారు. ఆధారాలు లేని కేసును ఎందుకు తీసుకొచ్చారంటూ దిల్లీ హైకోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసిందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొలేక కేంద్రం చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించారు. వారి కుట్రలను తేటతెల్లం చేయడానికి పార్లమెంటులో నిరసన తెలిపినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీజేపీ తీవ్రంగా మండిపడ్డ ఖర్గే
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున్ ఖర్గే సైతం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబాన్ని వేధించడానికి కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపించారు. రాజకీయ ప్రతీకారం కోసమే వారు ఇలా చేస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టారు. దిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మా నినాదం సత్యమేవ జయతే’ అని ఖర్గే పేర్కొన్నారు. ఈ తీర్పు నేపథ్యంలోనైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ఇక మీదటైనా ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని హితవు పలికారు.
LIVE: Special Press Briefing
📍New Delhi
— Mallikarjun Kharge (@kharge) December 17, 2025
Also Read: IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!
కాంగ్రెస్ సీనియర్ నేతల రియాక్షన్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venu Gopal) సైతం మీడియా సమావేశంలో మాట్లాడారు. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ఈడీని కేంద్రం ఏ విధంగా ప్రయోగిస్తుందోనన్న విషయాన్ని ఈ తీర్పు బహిర్గతం చేసిందని అభిప్రాయపడ్డారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనను అధికార దుర్వినియోగానికి ఒక ఉదాహరణగా అభివర్ణించారు. 2021-2025 మధ్య రాహుల్, సోనియాలను ఈడీ అనేకసార్లు ప్రశ్నించిందని కానీ ఈ కేసులో ఏ తప్పును నిర్ధారించలేకపోయిందని సింఘ్వీ గుర్తుచేశారు.

