Air India: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన తర్వాత, విమానాల్లో సాంకేతిక సమస్యలు, ప్రయాణాల్లో అవాంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అలాంటి ఘటనలు శనివారం రాత్రి ఒకటి, ఆదివారం ఉదయం మరొకటి నమోదయ్యాయి. శనివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో బ్రిటన్కు చెందిన ఎఫ్-35బీ లైట్నింగ్- II యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. హిందూ మహాసముద్రం మీదుగా వెళుతున్న ఈ విమానంలో ఇంధనం అయిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
‘‘ఎఫ్-35 యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో దారి మళ్లడం సాధారణమే. అన్ని వివరాలు తెలుసుకొని విమాన భద్రత దృష్ట్యా ల్యాండింగ్ను సులభతరం చేశాం. అన్ని విధాలా సాయం అందిస్తున్నాం. అన్ని ఏజెన్సీలతో ఐఏఎఫ్కు సమన్వయం ఉంటుంది’’ అని ఇండియన్ ఎయిర్ఫోర్స్ పేర్కొంది. కాగా, 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అయిన ఎఫ్-35బీ లైట్నింగ్-2 విమానం ‘హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ (నౌక) స్ట్రైక్ గ్రూప్’లో భాగంగా ఉంటుంది. ఈ నౌక ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల భారత నావికాదళంతో కలిసి నిర్వహించిన సముద్ర విన్యాసాలలో కూడా పాల్గొంది.
Read this- Bridge Collapses: మరో తీవ్ర విషాదం.. బ్రిడ్జి కూలి పర్యాటకుల గల్లంతు
విదేశాలకు చెందిన యుద్ధ విమానాలను ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయడం అసాధారణమే అయినప్పటికీ, కొత్తేమీ కాదని సైనిక విమానయానరంగ నిపుణులు పేర్కొన్నారు. ఇక, ఎఫ్-35బీ వేరియంట్ విమానాలను ప్రత్యేకంగా షార్ట్ టేకాఫ్లు, వర్టికల్ ల్యాండింగ్ (STOVL) కోసం తయారు చేశారు. విమాన వాహక నౌకల నుంచి సులభంగా పనిచేసేలా వీటిని డిజైన్ చేశారు. ఈ విమానం ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’ నౌక వద్దకు ఎందుకు చేరుకోలేకపోయిందో తెలియరాలేదు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నౌకపై ల్యాండింగ్ను నిలిపివేసి ఉండవచ్చని రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల కంపెనీ ‘లాక్హీడ్ మార్టిన్’ ఎఫ్-35 విమానాలను తయారు చేస్తుంది. ఈ అత్యవసర ల్యాండింగ్పై యూకే రక్షణ మంత్రిత్వ శాఖ, లాక్హీడ్ మార్టిన్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా, ఆదివారం ఉదయం నాటికి, ఈ యుద్ధ విమానం తిరువనంతపురం ఎయిర్పోర్టులోనే నిలిచి ఉంది.
Read this- Vijay Rupani: 3 రోజుల తర్వాత మాజీ సీఎం డెడ్బాడీ గుర్తింపు
చివరి నిమిషంలో నిలిచిపోయిన ఎయిరిండియా ఫ్లైట్
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. టేకాఫ్కు కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించారు. దీంతో, టేకాఫ్ను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా సాంకేతిక సమస్య ఏర్పడడంతో విమానాన్ని గంటకు పైగా నిలిపివేయాల్సి వచ్చిందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ‘ఎయిరిండియా ఎక్స్ప్రెస్’ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘హిండన్-కోల్కతా జర్నీకి కేటాయించిన విమానంలో సాంకేతిక సమస్యల తలెత్తడంతో టేకాఫ్ వాయిదా పడింది. మా అతిథులైన ప్యాసింజర్లకు ఉచితంగా రీషెడ్యూల్ లేదా పూర్తి వాపసుతో టికెట్ రద్దు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని ప్రకటనలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి వివరించారు. కాగా, విమానం రన్వేపై బయలుదేరడానికి ముందు చివరి నిమిషంలో సమస్యను గుర్తించినట్టు ఎయిర్పోర్టు వర్గాల ద్వారా తెలిసింది. సాంకేతిక సమస్య ఏంటనేది తెలియరాలేదు, కానీ, గ్రౌండ్ ఇంజనీర్లు వెంటనే రంగంలోకి దిగారని చెప్పారు. కాగా, హిండన్ విమానాశ్రయాన్ని ప్రధానంగా రక్షణ కార్యాకలాపాల కోసం నిర్మించారు.