Vijay TVK-BJP: సొంతంగా బలం లేకపోయినా, క్షేత్రస్థాయిలో పెద్దగా కేడర్ లేకున్నా.. ఏదో ఒక పార్టీతో జట్టు కట్టి, క్రమంగా బలోపేతం కావడం కేంద్రంలోని అధికార బీజేపీకి (BJP) అందెవేసిన చెయ్యి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) కూటమి సర్కారే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఉత్తరాదిలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలు కమలనాథులకు మొదటినుంచి కొరకరాని కొయ్యలుగానే ఉన్నాయి. ఆ జాబితాలో తమిళనాడు రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఎన్నోకొన్ని సీట్లు సాధించాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఇందుకోసం పకడ్బంధీ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
విజయ్తో పొత్తు కోసం విశ్వప్రయత్నాలు!
తమిళనాడులో విపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ హీరో విజయ్తో బీజేపీ పొత్తు (Vijay TVK-BJP) పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ఇటీవల తమిళనాడు వెళ్లిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ వ్యూహకర్త అమిత్ షా వ్యూహాత్మకంగా నడుచుకున్నారు. తమిళనాడులో ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని (AIADMk) కూడా ఆయన కలవలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా డీఎంకే వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే సంకేతాలు ఇచ్చారంటూ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Read Also- UPSC Aspirant: సివిల్స్లో ఫెయిలైనా.. ఏడేళ్లుగా కలెక్టర్గా చెలామనీ.. వీడు మాములోడు కాదు!
తమిళనాడు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో ఆ రాష్ట్ర నేతలకు అమిత్ షా కీలక సందేశాన్ని కూడా ఇచ్చారట. పోటీ చేయడం, పోరాడంతోనే సరిపెట్టుకోవద్దని, గెలవడంపై కూడా కచ్చితంగా దృష్టిపెట్టాలంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 2021లో కనీసం 4 అసెంబ్లీ స్థానాలైన గెలిచామని, కానీ, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయామంటూ అమిత్ షా గుర్తుచేశారు. అందుకే, ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పార్టీతో పొట్టు కుదుర్చుకోవాలని బీజేపీ చూస్తోంది. సెక్యూలరిజమ్ మీద దృష్టి పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమకు సహజ మిత్ర పార్టీ అంటూ ఇటీవల విజయ్ వ్యాఖ్యానించిన తర్వాత, బీజేపీ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి.
సెంటిమెంట్ కాదు.. గెలుపు ముఖ్యం!
ఇదే విషయమై రాష్ట్ర బీజేపీ నాయకుల అభిప్రాయాలను అమిత్ షా తీసుకున్నారని, క్షేత్రస్థాయిలో సెంటిమెంట్ ఎలా ఉంటుందో కూడా తెలుసున్నారు. అయితే, సెంటిమెంట్ కన్నా, ఎన్నికల్లో గెలుపోటములకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరి, బీజేపీ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మరోవైపు, ఎన్నికలు దగ్గరపడేంతవరకు ఎదురుచూడొద్దని, అభ్యర్థుల ఎంపిక ముందుగానే ఖరారు చేసుకోవాలంటూ ముఖ్యనేతలకు అమిత్ షా సూచించారు. ఎన్నికలకు ముందుగానే సంసిద్ధం కావాలని కోరారు.

