Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయానానికి సర్వంసిద్ధమైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్లో బుధవారం (జూన్ 25) ఆయనతో పాటు నాసా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయలుదేరనుంది. ఈ మేరకు నాసా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు వాయిదాల అనంతరం ఈ ప్రయోగ తేదీని ప్రకటించింది. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళతారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు యాక్సియం-4 మిషన్ ప్రయోగం జరుగుతుందని వివరించింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నామని, ఫాల్కన్-9 రాకెట్ స్పేస్ క్యాప్సూల్ను నింగిలోకి మోసుకెళుతుందని పేర్కొంది. శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టనున్నారు.
గురువారం డాకింగ్
ప్రయోగం విజయవంతమైతే భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో వ్యోమనౌక అనుసంధానం అవుతుంది. భూమి నుంచి బయలుదేరి దాదాపు 28 గంటలపాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరుతుంది. ఈ ప్రక్రియను డాకింగ్ అని పిలుస్తారు. అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుండగా, ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) ఈ మిషన్లో భాగస్వాములుగా ఉన్నాయి. కాగా, శుభాంశు శుక్లా సారధ్యంలోని వ్యోమగాముల బృందం ఐఎస్ఎస్లో 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. నిజానికి, మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. బుధవారమైనా ప్రయోగం విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
Read this- Viral News: ఆమె పంట పడింది.. రెండేళ్లుగా వెతుకుతున్నది దొరికింది
శుభాంశు శుక్లా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పూర్వ విద్యార్థి. టెస్ట్ పైలట్గా ఆయన కెరీర్ మొదలవ్వగా వ్యోమగామిగా మారారు. శుక్లా అంతరిక్షయానంపై ఐఐఎస్సీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అయిన అజయ్ కుమార్ సూద్ స్పందించారు. శుభాంశు శుక్లా అంతరిక్షయానం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కెరీర్ విశిష్టమైన, చారిత్రాత్మక మైలురాయి అందుకోబోతున్నందుకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
శుక్లా అంతరిక్షయానాన్ని భారత శాస్త్రీయ, సాంకేతిక ప్రయాణంలో కీలక మైలురాయి అని అభివర్ణించారు. ‘‘ఇది శుభాంశు ప్రయాణం మాత్రమే కాదు. మనందరి అంతరిక్షానికి ఆకాంక్షల ప్రయాణం’’ అని ప్రొఫెసర్ సూద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనలో విక్రమ్ సారాభాయ్ సారధ్యం నుంచి చంద్రయాన్-3, రాబోయే గగన్యాన్ మిషన్ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు.
యాక్సియం-4 ప్రయోగం ద్వారా అంతరిక్ష ప్రయోగాలలో ఇస్రో భాగస్వామ్యాన్ని చాటిచెబుతుందన్నారు. గత దశాబ్దాలలో అనుసరించిన విధానాల, శాస్త్రీయ రంగంలో స్థిరమైన పురోగతి ఫలితమే ఈ ప్రయోగమని ప్రొఫెసర్ సూద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇస్రో అధిగమించిన మైలురాళ్లు, సంస్థ నిబద్ధత, సామర్థ్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. శుభాంశు శుక్లా విజయం సాధించాలని 140 కోట్ల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయని అన్నారు. యాక్సియం-4 ప్రయోగం భారత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నతిని పెంచుతుందని, ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read this- Rinku Singh: నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిపై రింకూ సింగ్ కీలక నిర్ణయం