Ajith Doval: శత్రుదేశం అణుబాంబు తయారు చేస్తుంటే, ఏ దేశమూ చూస్తూ ఊరుకోదు. జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కాబట్టి, ఓ కన్నేసి కనిపెడుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా శత్రుదేశం శక్తియుక్తులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. 1980లలో భారతదేశం ఇదే పనిచేసింది. దాయాది దేశమైన పాకిస్థాన్ అత్యంత రహస్యంగా అణుబాంబు తయారీకి సిద్ధమవుతోందంటూ సమాచారం తెలిసిన వెంటనే నాటి భారత ఇంటెలిజెన్సీ విభాగం రంగంలోకి దిగింది.
పాకిస్థాన్ అణు ప్రణాళికలు నిజమేనా?, కాదా?, అసలు ఎక్కడ నిర్వహిస్తోంది? వంటి విషయాలను పసిగట్టి, నిర్ధారించుకోవడానికి ఒక ప్రత్యేక మిషన్ చేపట్టాల్సి వచ్చింది. పాకిస్థాన్కు వెళ్లి, అక్కడే ఉంటూ రహస్యాలను కనిపెట్టాల్సిన ఆపరేషన్ అది. మరి, దీనికి ఎవర్ని ఎంపిక చేయాలని ఇంటెలిజెన్సీ ఆలోచిస్తుండగా, అందరికీ గుర్తొచ్చిన ఆణిముత్యమే అజిత్ దోవల్ (Ajith Doval). నేడు ఆయన జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉంటారని.. ఆ నాడు ఎవరైనా ఊహించారో లేదో కానీ, అజిత్ దోవల్ 1980లలో పాక్లో అండర్ కవర్ ఏజెంట్గా ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
భిక్షాటన చేసే వ్యక్తిలా వీధుల్లో సంచారం..
రంధ్రాలు పడి, చినిగిపోయిన ఒక శాలువా కప్పుకొని, దుర్గంధమైన వీధుల్లో నాడు అజిత్ దోవల్ కొన్నేళ్లపాటు సంచరించారు. మారువేషంలో ఉన్న ఆయన మీద పాకిస్థానీయుల దృష్టి అస్సలు పడేది కాదు. బిక్షాటన చేసే వ్యక్తిగా భావించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. 1980లలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వీధుల్లో ఈ విధంగా తిరిగారు. ఇంకా, సింపుల్గా చెప్పాలంటే ఆయన ఓ భిక్షాటన చేసే వ్యక్తిలా అందరికీ కనిపించారు. చిల్లర అడుక్కుంటూ వీధుల్లో తిరిగారు.
కహూతా పట్టణంలో పాక్ రహస్యం
పాక్ అణుబాంబు ప్రణాళికలను నిర్ధారించేందుకు సీక్రెట్ మిషన్లో భాగంగా అజిత్ దోవల్ ఏకంగా ఆరేళ్లపాటు పాకిస్థాన్లోనే ఉన్నారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి నగరానికి సమీపంలోనే ఉన్న కహూతా అనే పట్టణంలో ఉన్న ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (KRL) గురించి తెలుసుకున్నారు. ఇదేదో సాధారణ పట్టణమని భావిస్తే పొరపాటే. ఎందుకంటే, పాకిస్థాన్ శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఇక్కడే ఉండేవారు. ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా సంచరిస్తుండేవారు. ఎందుకంటే, పాకిస్థాన్ అణు ప్రణాళికకు ఈ పట్టణమే అడ్డాగా ఉంది. అత్యంత రహస్యంగా ఇక్కడ మిషన్ను కొనసాగించారు. అందుకే, ఈ పట్టణంలో అత్యంత కట్టదిట్టమైన భద్రత ఉండేది. ఈ ప్రాంతంలో అజిత్ దోవల్ ఎవరికీ తెలియకుండా నెలల తరబడి తిరిగారు. దుమ్మ, ధూళీ మధ్య అక్కడ వీధుల్లో తిరిగారు. గల్లీగల్లీ తిరుగుతూ, అన్నీ గమనిస్తూ, గుర్తుపెట్టుకుంటూ ముందుకు కదిలేవారు. ప్రతి కదలిక, నడుచుకునే విధానం, రోజువారీ కార్యకలాపాలు, ఇలా అన్నీ ఇంటెలిజెన్స్ ప్రణాళికలో భాగంగా నడుచుకున్నారు.
Read Also- Ganesh Chaturthi 2025: గణేష్ పూజ చేసేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
వెంట్రుకలతో పాక్ గుట్టురట్టు
అజిత్ దోవల్ సీక్రెట్ ఆపరేషన్లో ఒక చిన్న సెలూన్ షాప్లో భారత్కు కావాల్సిన నిజం తెలిసిపోయింది. ఆ కటింగ్ షాపుకు ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో పనిచేసే శాస్త్రవేత్తలు తరచూ వస్తుండేవారు. కాబట్టి, అక్కడికి వచ్చేవారి వెంట్రుకలపై దోవల్ దృష్టిపెట్టారు. ఆ వెంట్రుకలను జాగ్రత్తగా సేకరించి భారత్కి పంపించారు. వాటిని ఇక్కడ మన ఇంటెలిజెన్స్ విభాగం ల్యాబొరేటరీస్లో విశ్లేషించి, జుట్టులో యురేనియం, రేడియేషన్ అవశేషాలు ఉన్నట్టుగా నిర్ధారించారు. తద్వారా పాకిస్థాన్ అణు ప్రణాళికలు నిజమేనని భారత్ నిర్ధారించుకుంది. ఈ సమాచారానికి అనుగుణంగా భారత జాతీయ భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది.
Read Also- VV Vinayak: కథతో సిద్ధంగా ఉన్న టాప్ దర్శకుడు.. హీరో ఓకే అంటే పట్టాలెక్కడమే ఆలస్యం
పాక్ అణు ప్రణాళికల గుర్తింపు కోసం భారత ఇంటెలిజెన్సీ ఆరేళ్లు శ్రమించాల్సి వచ్చింది. అజిత్ దోవల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్లో గడిపారు. పాక్ గనుక ఆయనను గుర్తించి ఉంటే కచ్చితంగా చంపేసి ఉండేవారు. అంతేకాదు, భారత్ భద్రతకు కూడా పెద్ద ముప్పు వాటిల్లి ఉండేది. దోవల్ సీక్రెట్ మిషన్ కారణంగానే పాకిస్థాన్ అణుపరీక్షలు దాదాపు పదిహేనేళ్లపాటు ఆలస్యమయ్యాయని భద్రతా నిపుణులు చెబుతుంటారు. సాహసోపేతమైన దోవల్ ఆపరేషన్ గురించి డీ. దేవదత్ రచించిన ‘అజిత్ దోవల్-ఆన్ ఏ మిషన్’’ అనే పుస్తకంలో వివరించారు.
కాగా, అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆయన సేవలకు ఎన్నో అవార్డులు దక్కాయి. అప్పటికే ఆయన ‘సూపర్ కాప్’ అనే పేరు ఉంది. కాగా, 1974లో భారతదేశం అణుపరీక్ష జరిపిన తర్వాత, అణు బాంబు ప్రణాళికలను పాక్ వేగవంతం చేసింది. పాకిస్థాన్కు చైనా వంటి దేశాలు సహకారం అందించాయి. అందుకే, పాక్ అణు ప్రణాళికలను వేగవంతంగా చేయగలిగింది.