Air India Flights Cut: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.. యావత్ భారతావనిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలి 270 మందికి పైగా ప్రాణాలు విడిచారు. అయితే ఇది మర్చిపోకముందే వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల అంతర్జాతీయ సర్వీసుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ విమానాల తగ్గింపు
అంతర్జాతీయ విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ అప్రమత్తమైంది. జూన్ 20 నుంచి జులై మధ్య వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది. వివాదాలకు కేంద్రంగా మారుతున్న వైడ్ బాడీ బోయింగ్ 777 విమానాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు స్పష్టం చేసింది. విదేశీ విమానాలను తగ్గించడం వల్ల ప్రభావితమయ్యే ప్రయాణికులకు ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలియజేసింది.
తగ్గింపునకు కారణాలు ఇవే!
గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానాల్లో నిర్వహణపరమైన ఇబ్బందులు తలెత్తినట్లు యాజమాన్యం అంగీకరించింది. ఈ కారణం చేత గత 6 రోజుల్లో 83 అంతర్జాతీయ సర్వీసులను రద్దు అయినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. తూర్పు ఆసియా దేశాల్లో రాత్రి కర్ఫ్యూ, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు, కొనసాగుతున్న భద్రతా తనిఖీలు కారణంగా అంతర్జాతీయ సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అయితే ఏ విమానాలను రద్దు చేస్తున్నామో ఇప్పుడే చెప్పలేమని.. దీనిపై మున్ముందు స్పష్టత వస్తుందని పేర్కొంది.
Also Read: Durga Rao: వాటిని కోసేశారంటూ.. ఏడ్చుకుంటూ వీడియో పెట్టిన టిక్ టాక్ దుర్గారావు
అహ్మదాబాద్ ఘటనపై క్షమాపణలు
జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Tata Sons Chairaman Chandrasekharan) తాజాగా స్పందించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆయన క్షమాపణలు తెలియజేశారు. విమానానికి ఉన్న రెండు ఇంజిన్లలో ఒకటి కొత్తదని చంద్రశేఖరన్ తెలిపారు. మరొక దానిని 2023లో సర్వీస్ చేశామని.. ఈ ఏడాది డిసెంబర్ లో తదుపరి సర్వీసు జరగాల్సి ఉందని అన్నారు. మంచి పనితీరుతో ఉన్న ఇంజిన్లను ఫెయిల్ అయ్యాయని చెబుతుండటం అర్ధరహితమని ఎయిర్ ఇండియా ఛైర్మన్ పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందన్న చంద్రశేఖరన్.. వాస్తవిక నివేదిక వెలువడే వరకు అనవసర ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు.