Indiramma Houses: భవనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ప్రకటించారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు 2020 నవంబర్ 1న సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి స్ధానికులతో సహపంక్తి భోజనం చేశారని, బంగారు వాసాలమర్రిగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఫాంహౌస్కు వెళ్లేందుకు రోడ్డు విస్తరణ
కానీ వాస్తవంగా ఆరోజు నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వాసాలమర్రి వైపు కన్నెత్తి చూడలేదని మంత్రి గుర్తుచేశారు. ఆయన ఫాంహౌస్కు వెళ్లేందుకు రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారన్నారు. ఆ బాధితులు ఇండ్లు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారన్నారు. బంగారు వాసాలమర్రి దేవుడెరుగని, ఉన్న ఇండ్లను కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తచేస్తున్నారని మంత్రి పొంగులేటి వివరించారు. కాగా వారిని ఆదుకునేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం అక్కున చేర్చుకుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు వాసాలమర్రి గ్రామంలో సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించినట్లు చెప్పారు.
Also Read: Disabled: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు!
తానే స్వయంగా అందజేస్తానన్న మంత్రి
అర్హులైన 205 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాలను తానే స్వయంగా అందజేస్తానని మంత్రి చెప్పారు. దేశానికి దశ దిశ చూపిస్తానని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ దత్తత గ్రామ ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. కొత్త ఇల్లు రాలేదని, ఉన్న ఇల్లు పోయిందని, ప్రజల అవసరాలను, ఆశలను వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకున్నారనేందుకు వాసాలమర్రి గ్రామమే నిదర్శనమని పొంగులేటి చెప్పారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం, సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విభలాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించనున్నారు.
Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!