CM Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Chandrababu: చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి!

Chandrababu: చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత ప్రధానుల మ్యూజియం, లైబ్రరీ ప్రాంగణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు స్మారకోపన్యాస సదస్సు జరిగింది. ‘ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ పేరుతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ సదస్సు నిర్వహించింది. ఇప్పటి వరకు ఐదుగురు మాజీ ప్రధానులకు సంబంధించిన స్మారకోపన్యాస సదస్సులు నిర్వహించిన కేంద్ర సాంస్కృతిక శాఖ.. ఆరో సదస్సుగా పీవీ నరసింహారావు స్మారకోపన్యాస సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ చదువుకున్న యువత రాజకీయాల విషయంలో విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇది సరైనది కాదు. నేను యువకులైన మంచి రాజకీయ నేతల గురించి వెతుకుతున్నాను. యువత అంతా ఆల్ ఇండియా సర్వీసెస్, బిజినెస్, మంచి ఉద్యోగం, మంచి కెరీర్ అంటున్నారు. కానీ మంచి ఉద్దేశ్యాలు మంచి భావాలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశానికి మంచి లీడర్షిప్ వస్తుంది. పబ్లిక్ పాలసీలు రూపొందించేది రాజకీయ నాయకులే.. బ్యూరోక్రాట్లు కాదు. ప్రజలకు మంచి చేసేలా విధానాలు రూపకల్పన చేయాలంటే రాజకీయ నేతల వల్లనే సాధ్యం. ఈ విషయాన్ని యువతరం గుర్తుంచుకోవాలి. టీడీపీ దేశంలోనే యంగెస్ట్ పార్టీ.. టీడీపీలో చాలా మంది యువకులు, చదువుకున్న వారు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు’ అని చంద్రబాబు వెల్లడించారు.

Read Also- Warangal Suicide Case: డాక్టర్ ప్రత్యూష మృతికి కారణం వాల్లే.. నలుగురు అరెస్ట్

దేశానికి మేలు మలుపు
‘ పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు. పీవీ తెలుగు బిడ్డ అని చెప్పుకోవడానికి తెలుగు వాళ్లు చాలా గర్వపడతారు. పీవీ మన దేశ భవిష్యత్తును ఓ కీలక మలుపు తిప్పిన నాయకుడు. 17 భాషల్లో ప్రావీణ్యం కలిగిన పండితుడు. ఇప్పుడు హిందీ భాష ఎందుకు అనే చర్చను కొందరు తెరమీదకు తెస్తున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకున్న పీవీ లాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. 1991 వరకు భారతదేశం సోషలిస్టు మోడల్‌ను అనుసరించింది. లైసెన్స్ రాజ్‌గా పిలవబడే నియంత్రణలు వ్యాపారాల అభివృద్ధికి అడ్డుపడ్డాయి. విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్థిక వృద్ధి రేటు సంవత్సరానికి 3-4% మాత్రమే. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. చమురు దిగుమతులకు ఇబ్బందులు కలిగేవి. దేశపు బంగారాన్ని తాక్టటు పెట్టాల్సిన పరిస్థితి. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచిన నాయకుడు పీవీ. మెజారిటీ లేకున్నా.. తన రాజకీయ చతురతతో అన్ని పార్టీలను ఒప్పించి పీవీ సంస్కరణలను తెచ్చారు. లైసెన్స్ రాజ్‌ అరాచకాలకు పీవీ ముగింపు పలికారు. విదేశీ పెట్టుబడులకు బాటలు వేశారు. దిగుమతులపై సుంకాలు తగ్గించి, పన్ను విధానాలను సరళతరం చేసి, బహిరంగ మార్కెట్‌ను తెరిచారు. దీంతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కింది. చక్కటి పాలసీలు తెచ్చి అమలు చేస్తే.. మంచి మార్పులు వస్తాయి. పీవీ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. చైనాలో డెంగ్ జియాపింగ్ ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. పీవీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఓ విధంగా చెప్పాలంటే పీవీని ఇండియా డెంగ్ జియా పింగ్ అని చెప్పొచ్చు’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Chandrababu

అటల్‌తో కలిశాం… అభివృద్ధి చేశాం!
‘ చాలామంది ప్రధానులతో కలిసి పని చేశాను. సంకీర్ణ ప్రభుత్వాలలో కీలక భాగస్వామిగా ఉన్నాను. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మౌలిక వసతుల అభివృద్ధికి, టెలికాం విప్లవానికి బలం ఇచ్చారు. వాజ్‌పేయీతో పని చేయడం అదృష్టం. హైవేలు, ఐటి పార్కులు, ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నారు. 1995లో నేను ఏపీలో రెండో తరం ఆర్థిక సంస్కరణలు తెచ్చాను. నేషనల్ హైవేల అభివృద్ధిపై నాటి ప్రధాని వాజ్ పేయితో చర్చించాను. చాలా దారుణమైన పరిస్థితుల్లో అప్పట్లో రోడ్లు ఉండేవి. దీనికి ఓ విధానాన్ని రూపొందించాం. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు-చెన్నై నేషనల్ హైవే ప్రాజెక్టు చేపట్టాం. ఆ తర్వాత స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తెచ్చాం. అలాగే టెలీ కమ్యూనికేషన్ల రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు నాటి ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలో శ్రీకారం చుట్టాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Read Also- Nara Lokesh: విద్యార్థి కన్నా వెనుకబడిన విద్యాశాఖ మంత్రి లోకేష్!

రైట్ టైమ్.. రైట్ లీడర్
‘ 2014లో దేశానికి ఓ మలుపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ధైర్యంగా, లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2028 నాటికి జర్మనీని దాటి భారత దేశం ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరనుంది. ఆర్థిక స్థిరత్వం, జాతియతా భావం పెంపొందడం, అంతర్జాతీయంగా భారతదేశానికి గౌరవం దక్కడం వంటివి మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయి. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం గత దశాబ్దంలో 17 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్రమైన పేదరికం నుండి బయటపడ్డారు ఆపరేషన్ సింధూర్ ద్వారా మోదీ టెర్రరిస్టులకు ధీటుగా సమాధానం చెప్పారు. ఇండియా సత్తా చాటారు. పబ్లిక్ పాలసీలు ప్రజల కోసం తేవాలి. నరేంద్ర మోదీ తెస్తున్న సంస్కరణలు ప్రజల కోసం.. ప్రజల మధ్య అసమానతలు తగ్గించేలా ఉన్నాయి. రైట్ లీడర్.. రైట్ టైమ్.. రైట్ ప్లేసులో ఉన్నారు. మోదీ సారధ్యంలో వివిధ రంగాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్ర భాగాన నిలుస్తోంది. సంస్కరణలు తేవడం ద్వారా పీవీ దేశానికి దిశ చూపారు. వాజ్‌పేయీ బలమైన పునాదులు వేశారు. మోదీ దేశానికి ఊపు ఇచ్చారు’ అని చంద్రబాబు చెప్పారు.

మంచి చేసేవారినే ఎన్నుకోవాలి..
‘ ప్రజలు… యువత అన్ని కోణాల్లో ఆలోచించాలి. వారి ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి దిశగానే ఉండాలి. నేను చాలామంది నేతలను చూశాను. రాజకీయ నేతల్లో దూరదృష్టి కలవారు ఉన్నారు. సమర్ధులు ఉన్నారు.. విధ్వంసకారులూ ఉన్నారు. ఎవరిని నమ్మాలి.. ఎవర్ని ఎన్నుకోవాలి.. భారతదేశ అభివృద్ధి కోసం ఎవరికి సహకరించాలనే దానిపై అందరూ ఆలోచన చేయాలి. స్మార్ట్ వర్క్ చేయాలి.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. క్వాంటం మిషన్ కేంద్రం ప్రారంభించింది. సిలికాన్ వ్యాలీ అమెరికాకు ఉంది.. మనకు క్వాంటం వ్యాలీ ఎందుకు ఉండకూడదనే ఉద్దేశ్యంతో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. సంపద సృష్టించాలి.. దాన్ని పేదలకు పంచాలి. ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేకత ఉంది. మన సంస్కృతి మన గొప్పదనాన్ని చాటుతుంది’ అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానుల మ్యూజియం, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ సహా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రబాబును సన్మానించేందుకు పీవీ కుమారుడు, మనవడు వేదిక మీదకు రాగా.. తనకు కాదని మీకే సన్మానం చేయాలంటూ చంద్రబాబు వారికి శాలువాలు కప్పి సత్కరించారు.

Chandrababu And Amit Shah

అమిత్ షాతో భేటీ..
కార్యక్రమం అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్‌గా నియమించడంపై హోం మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించే అంశాలపై సీఎం హోం మంత్రికి వివరించారు. గత ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియచేసిన ముఖ్యమంత్రి కేంద్ర సహకారంతో ధ్వంసమైన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలియచేశారు. అయితే ఇప్పటికీ ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కోంటున్న ఏపీకి కేంద్రం నుంచి మరింతగా సహకారం అందించే అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్ధిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం –బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.

Read Also- SSMB 29: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో వారు చేయట్లేదా?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?