EU Chief Plane – Russia: యూరోపియన్ యూనియన్ (EU) కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ టార్గెట్గా (EU Chief Plane – Russia) రష్యా కుట్ర పన్నిందా?, ఆమె ఓ జెట్లో బల్గేరియాకు ప్రయాణిస్తున్న సమయంలో విమానం ల్యాండింగ్ కావాల్సిన విమానాశ్రయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) సేవలను జామ్ (పనిచేయకపోనివ్వడం) చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి యూరోపియన్ యూనియన్ వర్గాలు. మీడియాలో వచ్చిన కథనాలు నిజమేనని ఈయూ ప్రతినిధి ఒకరు సోమవారం నిర్ధారించారు.
జీపీఎస్ సేవలు జామ్ అయినప్పటికీ, ఉర్సులా ప్రయాణించిన విమానాన్ని పేపర్ మ్యాప్స్ ఆధారంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండా, విమానం సురక్షితంగా బల్గేరియాలోని ఒక ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిందని ఆయన వివరించారు. ఈ ఘటన రష్యా బహిరంగ జోక్యమని బల్గేరియా ప్రభుత్వం భావిస్తోందని, విషయాన్ని యూరోపియన్ కమిషన్తో పంచుకుందని చెప్పారు.
‘‘జీపీఎస్ సేవలు జామింగ్ అయిన విషయం నిజమే. కానీ, విమానం మాత్రం బల్గేరియాలోని ఓ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇది రష్యా ఉద్దేశపూర్వక జోక్యమని బల్గేరియా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మాతో సమాచారాన్ని పంచుకున్నారు’’ అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు.
ఈ ఘటనపై యూరోపియన్ యూనియన్ (EU) ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిందని ఆ అధికారి వెల్లడించారు. కాగా, బల్గేరియాలోని ఓ విమానాశ్రయంలో జీపీఎస్ నావిగేషన్ సేవలు నిలిచిపోవడం వెనుక రష్యా జోక్యం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు ఇదివరకే పలు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఎయిర్పోర్టులో జీపీఎస్ సేవలు నిలిచిపోవడంతో ఉర్సులా ప్రయాణించిన విమానం ప్లోవ్దివ్ (Plovdiv) నగరంలోని ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యిందని, పేపర్ మ్యాప్ల సాయంతో దారిని గుర్తించి ల్యాండింగ్ చేశారని కథనాలు పేర్కొన్నాయి.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్కు ఈసారి టెంపులే!
ఈ కథనాలపై స్పందించేందుకు రష్యా ప్రభుత్వం నిరాకరించింది. ఎలాంటి స్పందన ఇవ్వలేదని సమాచారం. ఈ ఘటనపై యూరోపియన్ యూనియన్ ఎక్కువ వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, తమ రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకోవాలన్న లక్ష్యాన్ని మరింత బలపరుస్తోందని ఈయూ ప్రతినిధి ఒకరు చెప్పారు. రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు మద్దతును కొనసాగిస్తామని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం మూడున్నరేళ్లుగా సాగుతోందని ప్రస్తావించారు.
కాగా, ఈ ఘటనపై బల్గేరియా ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన చేసింది. ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ప్రయాణించిన విమానం ప్లోవ్దివ్ నగరానికి చేరుకోబోతున్న సమయంలో జీపీఎస్ సిగ్నల్స్ పూర్తిగా తెగిపోయాయని పేర్కొంది. అకస్మాత్తు పరిణామంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు భూఆధారిత నావిగేషన్ సిస్టమ్లకు మారాలని అధికారులు నిర్ణయించారని, తద్వారా విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగలిగిందని ప్రకటనలో వివరించింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఉర్సులా 4 రోజుల పాటు రష్యా సరిహద్దులో ఉన్న ఈయూ సభ్యదేశాలను సందర్శించే పర్యటనలో భాగంగా బయలుదేరారని వివరించింది.