Social Media Ban: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్ద వరకూ ప్రతీ ఒక్కరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు చిన్నారులపై ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాలు పెను ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన కొత్త చట్టం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) స్వయంగా ప్రకటించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం చట్టం రానుండటం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
చట్టంలోని ప్రధాన అంశాలు..
‘ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్ 2024’ (Online Safety Amendment (Social Media Minimum Age) Bill 2024) పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం 16 ఏళ్ల లోపున్న చిన్నారులు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్, టిక్ టాక్, యూట్యూబ్, థ్రెడ్స్, ఎక్స్ (ట్విటర్ ) వంటి ప్రధాన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను వినియోగించడం నిషిద్ధం. ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఖాతాలను తెరవడం, వినియోగించడం, ఫొటోలు – వీడియోలు అప్ లోడ్ చేయడం, చాట్ గ్రూప్స్ – ఆన్ లైన్ కమ్యూనిటీల్లో చేరడం వంటి చర్యలను ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆన్ లైన్ వినియోగం ద్వారా పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాలను నియంత్రించడం, హానికారక కంటెంట్ కు వారిని దూరంగా ఉంచడం, అసభ్యకరమైన కంటెంట్ కు ప్రభావితం కాకుండా అడ్డుకోవడమే ఈ చట్ట ఉద్దేశమని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు.
We’re banning social media for under-16s to keep them safe online. pic.twitter.com/wUjYZpjzzG
— Anthony Albanese (@AlboMP) November 10, 2025
‘నిషేధం కాదు.. గ్యాప్ మాత్రమే’
పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ (Anika Wells) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిస్థాయి నిషేధం కాదని.. సోషల్ మీడియాలో అడుగుపెట్టడానికి పిల్లలకు కొంత సమయం ఇవ్వడమేనని ఆమె పేర్కొన్నారు. యువ ఆస్ట్రేలియన్లను ఆన్ లైన్ ముప్పు నుంచి సురక్షితంగా ఉంచడంలో ఈ చట్టం కీలక భూమిక పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. 16 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ చట్టం గణనీయమైన మార్పులు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యువతను శిక్షించేందుకు ఈ చట్టం తీసుకురాలేదు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, హానికారకమైన కంటెంట్ నుండి వారిని రక్షించడం కోసం తీసుకున్న నిర్ణయం ఇది’ అని మంత్రి అనికా వెల్స్ స్పష్టం చేశారు.
చట్టం అమలుపై సందేహాలు…
సోషల్ మీడియా నిషేధం చట్టాన్ని ఎలా అమలు చేస్తారన్న దానిపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి మెలిస్సా మెక్ఇంటోష్ దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చట్టం అంచనాలు అందుకోవడంలో విఫలమవుతుందని అభిప్రాయపడ్డారు. చిన్నారుల వయసును ఎలా నిర్ధారిస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు మెటా, గూగుల్, టిక్ టాక్ వంటి సంస్థలు సహకరించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై నిషేధానికి పలు దేశాలు ప్రయత్నించినప్పుడు ఆయా సంస్థలు ప్రతిఘటించిన సందర్భాలను ఆమె గుర్తుచేశారు.
Also Read: CM Yogi Adityanath: యూపీ సీఎం మరో సంచలనం.. ఇకపై స్కూళ్లల్లో అది తప్పనిసరి.. కీలక ఆదేశాలు జారీ
చిన్నారులపై తీవ్ర ప్రభావం
గతేడాది విడుదలైన ఆస్ట్రేలియా ఈ సేఫ్టీ కమిషనర్ నివేదిక (Australian eSafety Commissioner) ప్రకారం 8-12 ఏళ్ల వయసున్న ప్రతీ నలుగురు చిన్నారుల్లో ఒకరు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. వీరిలో చాలామంది హింసాత్మక కంటెంట్, స్వీయహానికర చిత్రాలు, సైబర్ బుల్లీయింగ్ వంటి వాటిని చూసినట్లు తేలింది. దీనిని ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా సంస్థలపై మంత్రి అనికా వెల్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సంస్థలు పిల్లల దృష్టిని ఆకర్షించేందుకు సోషల్ మీడియాను ఆయుధంగా వినియోగిస్తున్నాయని ఆరోపించారు.
