Ghatkesar fraud: రిఫరల్ కమీషన్ కోసం కక్కుర్తి పడి ఓ వ్యక్తి కటకటాల పాలయ్యారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వందిత అనే మహిళ అడ్మినిస్ట్రేటర్ గా ఫనుక్ రొటోటిక్ ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ రెండు వాట్సాప్ గ్రూపులను ప్రారంభించింది.
వీటిల్లో సభ్యులుగా చేరి పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు సంపాదించుకోవచ్చంటూ ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఘట్ కేసర్ నివాసి మధుసూదన్ ఈ గ్రూపుల్లో సభ్యునిగా చేరి 2.20లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టాడు. ఈ క్రమంలో కంపెనీ అతనికి రోజువారీగా లాభాలు వచ్చాయంటూ కొన్ని చెల్లింపులు చేసింది.
ఆ సమయంలో కొత్తవారిని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తే కంపెనీ 11శాతం కమీషన్ గా ఇస్తుందని మధుసూదన్ కు తెలిసింది. ఇదే విషయాన్ని అడుగగా వందిత కమీషన్ ఇస్తామని చెప్పింది. దాంతో ఆమె సూచనల మేరకు నేరెడ్ మెట్ లోని 1980మిలటరీ హోటల్ లో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన మధుసూదన్ పదుల సంఖ్యలో జనాన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారు. మూడు నుంచి నాలుగు వందల శాతం లాభాలు వస్తాయంటూ వారితో 22.69 లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టించాడు.
Also read: Drug Mafia In Dhoolpet: ఆపరేషన్ ధూల్పేట్.. డ్రగ్ మాఫియాకు షాక్!
మధుసూదన్ చెప్పిన మాటలు నమ్మి ఇలాగే పెట్టుబడులు పెట్టిన రాబిన్ వినయ్ కుమార్ అనే బాధితుడు లాభాలు రాకపోవటంతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన డీఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మధుసూదన్ ను మంగళవారం అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు.