తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో భాగంగా తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్ను విస్తరించాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ యూనిట్లో 4 బెడ్లుండగా.. వాటికి అదనంగా 8 బెడ్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ఆర్టీసీ ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది.
ఈ యూనిట్ విస్తరణకు సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) అంగీకరించింది. రూ.కోటి సాయం చేసేందుకు ముందుకువచ్చింది. నిర్మాన్ డాట్ ఓఆర్జీ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఈ యూనిట్ను ఐఓసీఎల్ విస్తరించనుంది.
Also read: Gadwal District: ఆ బావి కోసం కలెక్టర్ ను కలిసిన రాజ వంశీయులు..
దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఆర్పై శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు సహకరించనుంది. హైదరాబాద్ బస్ భవన్లో బుధవారం తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్ను విస్తరణకు సంబంధించిన ఒప్పందం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సమక్షంలో జరిగింది. ఐఓసీఎల్, నిర్మాణ్ డాట్ ఓఆర్జీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ తార్నాక ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎమర్జెన్సీ కేర్ యూనిట్ను విస్తరిస్తున్నామని, అందుకు సహకరిస్తోన్న ఐఓసీఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలోనే 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్తో పాటు క్యాథ్ల్యాబ్ సేవలు ఉద్యోగులకు అందుబాటులో వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐవోసీఎల్ ప్రతినిధులు ఎస్సీ మెస్రాం, పి.కైలాష్ కాంత్, వీవీఎస్ చక్రవర్తి, నిర్మాన్ డాట్ ఓఆర్జీ సీవోవో పుల్లా అనురాధతో పాటు తార్నాక ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.