Hyderabad: హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసే రౌడీషీటర్లు, స్నాచర్లపై ఇకపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ ఉన్నతాధికారులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా పోలీసులపైనే దాడికి పాల్పడితే, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సంఘ వ్యతిరేక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం సాయంత్రం చాదర్ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోవడానికి యత్నించిన కాలాపత్తర్ రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం వివరణ ఇచ్చారు.
ఏం జరిగింది?
ఒక వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ను దొంగిలించిన రౌడీషీటర్ ఉమర్ అన్సారీ తన సహచరులతో కలిసి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు. దీనిని గమనించిన డ్రైవర్ సందీప్ సమాచారం ఇవ్వడంతో, డీసీపీ చైతన్య తన గన్ మెన్ మూర్తితో కలిసి ఆ ఆటోను దాదాపు 750 మీటర్ల దూరం వెంబడించారు. విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే ఉమర్ అన్సారీ ఆటోలోంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. పట్టుకోవడానికి ప్రయత్నించిన డీసీపీ చైతన్య, గన్మెన్ మూర్తిలను బలంగా తోసివేయడంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. అయినప్పటికీ, వెంటనే తేరుకున్న డీసీపీ చైతన్య ఆత్మరక్షణ కోసం పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఉమర్ అన్సారీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు డీజీపీ తెలిపారు.
పరామర్శించిన డీజీపీ, సీపీ
కాల్పుల ఘటనలో గాయపడిన డీసీపీ చైతన్య, గన్మెన్ మూర్తి ప్రస్తుతం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. డీసీపీ చైతన్య, గన్మెన్ మూర్తి, డ్రైవర్ సందీప్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు అభినందనీయమని డీజీపీ కొనియాడారు. రౌడీషీటర్ ఉమర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతనిపై కాలాపత్తర్ స్టేషన్లో 22 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
Also Read: Trains Cancelled: మెుంథా తుపాను ఎఫెక్ట్.. విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!
ప్రత్యేక బృందాలు
పరారీలో ఉన్న ఉమర్ అన్సారీ సహచరుడు, ఆటో డ్రైవర్ను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. పోలీసులు నిత్యం ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటారని, రౌడీషీటర్లు, దొంగలు, స్నాచర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మజ్లిస్ పార్టీ బహదూర్పురా ఎమ్మెల్యే ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
