Swetcha Effect: వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి నుంచి పెద్ద సంఖ్యలో మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో జోరుగా సాగుతున్న ఈ ఇంజక్షన్ల విక్రయాలపై స్వేచ్ఛ’ రెండు రోజుల క్రితం ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్షా 32వేల రూపాయల విలువ చేసే 110 మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మొఘల్ పురా నివాసి మహ్మద్ జిబ్రాన్ అహమద్ ఎలియాస్ సమీర్ గోలీ (30) వ్యాపారి. జిమ్ కు వెళ్లే అలవాటున్న సమీర్ గోలీ కొంతకాలంగా మెఫెంటిమైన్ ఇంజక్షన్లను న్యూ ఢిల్లీలోని ఇండియా మార్ట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాడు. కాగా, వీటికి పాతబస్తీలో డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని గ్రహించిన సమీర్ గోలీ ఒక్కో ఇంజక్షన్ ను 324 రూపాయలకు ఆన్ లైన్ ద్వారా తెప్పించుకుని గౌలిపురా మార్కెట్ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయించటం మొదలు పెట్టాడు.
Also Read: Bangladeshis Arrested: జన్మ ధృవీకరణ నుంచి ఓటు హక్కు వరకు.. నకిలీ జీవితం ఎలా సాధ్యం?
ఇక, బాలాపూర్ నివాసి, బీఫ్ షాప్ నిర్వాహకుడు అహమద్ ఖురేషి (30) కూడా ప్రతీరోజూ జిమ్ కు వెళుతుంటారు. కండలు పెంచటానికి మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను తీసుకోవటానికి అలవాటు పడ్డ ఖురేషి కూడా న్యూ ఢిల్లీలోని ఇండియా మార్ట్ నుంచి ఆన్ లైన్ ద్వారా వీటిని పెద్ద సంఖ్యలో తెప్పించుకుంటూ అమ్మటం ప్రారంభించాడు.
ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడకుండా ఈ ఇంజక్షన్లను అమ్ముతున్నట్టు తెలిసి టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, ఎస్సైలు మహేశ్, నర్సింలు, ఆంజనేయులు, నవీన్ లతోపాటు సిబ్బందితో కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మొఘల్ పురా, చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు