Hyderabad Crime: ఒడిషా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ తోపాటు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న గంజాయి డాన్ ను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 115 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, అదనపు ఎస్పీ భాస్కర్ తో కలిసి వివరాలు తెలిపారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బూర్గుపాడు ప్రాంతానికి చెందిన డీ.శివారెడ్డి కొన్నేళ్లుగా గంజాయి దందా చేస్తున్నాడు.
ఈ క్రమంలో 2019లో 150 కిలోలు, 2022లో 400 కిలోలు, 2024లో ఒకసారి 240, మరోసారి 120 కిలోల గంజాయితో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలుకు వెళ్లిన ప్రతీసారి బెయిల్ పై విడుదలై బయటకు వస్తున్న శివారెడ్డి తిరిగి గంజాయి స్మగ్లింగ్ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే మరో ఇద్దరితో కలిసి కారులో ఒడిషా వెళ్లిన శివారెడ్డి 115 కిలోల గంజాయి కొన్నాడు. దానిని కారులో దాచి పెట్టి హైదరాబాద్ చేరుకున్నాడు.
జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర దానిని కొనుగోలుదారునికి ఇవ్వటానికి ప్రయత్నిస్తుండగా సమాచారం తెలిసి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీ టీం లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివసిద్దుతో పాటు కానిస్టేబుళ్లు మౌలాలి, దినేష్, లోకేశ్, వేణులతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. శివారెడ్డిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, అధికారులను చూసి శివారెడ్డి ఇద్దరు సహచరులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్టు జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
Also Read: Betting Apps Promotion: సామాన్యుడి కన్నెర్ర.. సచిన్, విరాట్, షారుఖ్ పై పోలీసులకు ఫిర్యాదు
విద్యార్థుల అరెస్ట్…
బీటెక్ చదువుతూ గంజాయి దందా చేస్తున్న ముగ్గురు విద్యార్థులను కూడా ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ కాలనీ ప్రాంతంలోని వసంత్ నగర్ లో ఉంటున్న కరీంనగర్ జిల్లా సుల్తాన్ పూర్ కు చెందిన రాహుల్, పెద్దపల్లికి చెందిన అజయ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలానికి చెందిన అభిలాష్ లు తాముంటున్న ఇంట్లోనే గంజాయి స్టాక్ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.