Nagababu on Terror Attack: ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులేనని, ఉగ్ర దాడుల ప్రభావం, దాని పర్యవసానానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన, అనుభవం ఉన్నదని, గతంలో గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దుశ్చర్యల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ రోదిస్తూనే ఉన్నారని, తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎందరో ఇంకా అదే భయంతో కొట్టుమిట్టాడుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు.
జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ సంతాప దినాలు నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు సాయంత్రం హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: Kavitha – KTR Harish Rao: నిన్న కేటీఆర్.. నేడు కవిత.. హరీషన్నకు ఎంత కష్టమెుచ్చిందో!
ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడి మరీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయుల కుటుంబాలకు భరోసానివ్వాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, తెలంగాణ నాయకులు శ్రీ సాగర్ ఆర్. కె. నాయుడు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాధారం రాజలింగం, కావ్య, శిరీష, రాజేష్, మాధవ రెడ్డి, నందగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/