Hyderabad Alert: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీంట్లో 8మంది చనిపోయినట్టుగా అధికారవర్గాలు తెలిపాయి. కాగా, ఈ సంఘటనతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్ మాల్స్, రద్ధీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు.
Also Read: Delhi Car Blast: దిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్.. గాల్లోకి ఎగిరిపడ్డ మృతదేహాలు
హైదరాబాద్ లో హై అలర్ట్
ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో కేంద్ర హెూంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర హెూంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసలు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. దీంతో ప్రధాన కూడళ్లతోపాటు రైల్వేస్టేషన్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే, ఓల్డ్ సిటీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని పోలీసు కమిషనర్ సజ్జనార్ నగరవాసులను కోరారు. డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో హై అలర్ట్
దిల్లీ ఎర్రకోట మెట్రో వద్ద పేలుడుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్లో భాగంగా శంషాబాద్ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి క్యాబ్లను పార్కింగ్, ఇతర ప్రాంతాలన్నీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో ఎప్పడికప్పుడు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read: Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన
ఢిల్లీ పేలుడుతో స్టేట్ పోలీస్ అలర్ట్
ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఉగ్ర కదలికలు ఏమైనా ఉన్నాయా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారు…వారి పరిచయస్తులపై నిఘా పెట్టారు. సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారు బాంబు పేలిన విషయం తెలిసిందే.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం
దీంట్లో 8మంది చనిపోయినట్టుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కాగా, దీనికి రెండు రోజుల ముందు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వీరిలో డాక్టర్ చదివిన రాజేంద్రనగర్ నివాసి అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఉండటం గమనార్హం. వీరి నుంచి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు గ్లోకో పిస్టళ్లతోపాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముగ్గురు ఢిల్లీ, అహమదాబాద్, లక్నోలో రెక్కీ కూడా జరిపినట్టుగా వెల్లడైంది. లష్కర్ ఏ తొయిబా, జైష్ ఏ మహ్మద్ సంస్థల కోసం వీళ్లు పని చేస్తున్నట్టుగా తెలిసింది.
టెర్రరిస్టులు హైదరాబాద్ లో రక్తపాతం
వీళ్ల అరెస్ట్ జరిగిన 48గంటల లోపే ఢిల్లీలో కారు బాంబు పేలటం గమనార్హం. ఈ క్రమంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో మరింత మంది ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్టుగా అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో పలు సందర్భాల్లో ఉగ్ర మూలాలు రాష్ట్రంలో బయట పడటం కొన్నిసార్లు టెర్రరిస్టులు హైదరాబాద్ లో రక్తపాతం సృష్టించిన నేపథ్యంలో తాజా సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా తనిఖీలను ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు జరపాలని చెప్పారు. అనుమానాస్పదంగా ఎవ్వరు కనిపించినా అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించాలని తెలిపారు.

