Rave Parties: ఒకప్పుడు ఫాంహౌస్ అంటే వ్యవసాయ క్షేత్రంలో రైతు తల దాచుకునేందుకు గుడిసెలు, రేకులతో నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు విలాసాలకోసం పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలతో పాటు స్విమ్మింగ్ ఫుల్(Swimming full), క్రీడా ప్రాంగణా(Sports Corts)లు ఏర్పాటు చేసి ఫాంహౌస్లుగా పిలుస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలు ఫాంహౌస్ అనేది కాకుండా విలాసవంతమైన భవనాలుగా పిలువడం తప్పులేదు. కానీ, వ్యవసాయ క్షేత్రల పేర్లను చెడగొట్టేందుకు విలాసాలు చేస్తున్నారు. ముద్దుగుండే ఇంగ్లీష్ పేర్లతో ఫార్మర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
జీగేల్ అనే లైట్స్తో ఎంజాయ్..
ఆనందం, ఆహ్లాదాన్ని పంచేందుకు ఫాంహౌస్ పేరుతో నిర్మించిన భవనాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అశ్లీలత, అసాంఘిక కార్యక్రమాలకు యువత ఆకర్షతులు అవుతన్నారు. పెళ్లిరోజు, పుట్టినరోజులే కాకుండా ఏదైనా సందర్భం వస్తే చాలు పార్టీ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. దీంతో యువత ఎంజాయ్ మోజులో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నగర శివారులోని ఫాంహౌస్లు ఎంజాయ్లకు అడ్డాగా మారిపోతున్నాయి. సాయంత్రం దాటితే శివారులోని ఇండ్లల్లో పార్టీలు నడుస్తున్నాయి. డీజే సౌండ్, అర్ధరాత్రి అందమైన భామల నృత్యాలతో హోరెత్తిపోతున్నాయి. ప్రమాదకరమైన కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్, గంజాయి, హుక్కా, ఖరీదైన విదేశీ మద్యం మత్తులో తేలియాడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో తరచూ రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, వారి పిల్లలు పట్టుబడుతుండడం గమనార్హం. పోలీసులు తరచూ దాడులు చేస్తున్నా నిర్వాహకులు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదు.
ఈ ప్రాంతాల్లోనే అత్యధికం..
ప్రతివారం వీకెండ్ పార్టీలు.. ఈ పార్టీల్లో విదేశీ డ్రగ్స్, గంజాయి అందుబాటులో ఉడడం గమనార్హం. ప్రభుత్వం అనుమతి లేకుండానే నిర్మాణాలు, క్షేత్రస్థాయిలోని అధికారుల కండ్లు కప్పి పార్టీలు నిర్వహిస్తున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్నగర్, మంచాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లోనే రేవ్, ముజ్రా పార్టీలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు శివారుల్లో భారీగా భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్లు నిర్వహిస్తున్నారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ఎగువ ప్రాంతాల్లో పచ్చని చెట్లు, ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు.
Also Read: Dhaka Airport: ఢాకా ఎయిర్పోర్టులో తీవ్ర అగ్నిప్రమాదం.. విమానాలన్నీ నిలిపివేత
111 జీవోకు విరుద్ధంగా..
జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా ఫాం హౌస్లు ఉన్నాయి. జంట జలాశయాల చుట్టు పక్కనే 700పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 111 జీవో పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి లేకపోవడంతో ధనవంతులు తమ వ్యవసాయ భూముల్లో విలాసవంతమైన క్లబ్బులు, రిసార్టులు ఏర్పాటు చేశారు. వీరిలో కొంతమంది వివాహ రిసెప్షన్లు, బర్త్ వేడుకలు, వీకెండ్ పార్టీలకు అద్దెకిచ్చి ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పిల్లలు ఇక్కడ వాలిపోతుంటారు. బర్త్ డేలు, ఇతర పార్టీల పేరుతో అర్థరాత్రి వరకు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తూ మద్యం సేవిస్తుంటారు. స్వదేశీ మద్యానికి అనుమతి తీసుకోకుండా గుట్టుగా విదేశీ మద్యాన్ని సేవిస్తున్నారు. ప్రమాదకరమైన డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. వీటి చుట్టే గంజాయి, డ్రగ్ పెడ్లర్స్ కూడా మాటు వేసి కూర్చొని ఉండటం, హత్యలు, అత్యాచారాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
పోలీసులకు వణుకే..
ఫాంహౌస్లలోకి ఎక్సైజ్, సివిల్ పోలీసులు వెళ్లాలంటే పోలీసులు జంకుతున్నారు. తనిఖీలకు అధికారులు రాకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కొంతమంది ప్రధాన గేటు, మెయిన్ డోరును రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. ఇతరులు ప్రయత్నించినా తెరుచుకోకుండా ఖరీదైన తాళాలు బిగిస్తున్నారు. ఫాంహౌస్కు ప్రధాన రహదారి వద్దకు వచ్చి వెళ్లిపోయేవారి వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. దీంతో తనిఖీ కోసం లోనికి వచ్చేందుకు యత్నించే పోలీసులను గేటు బయటే అడ్డుకుంటున్నారు. ప్రముఖ నేతలతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించి, వచ్చిన వాళ్లను వెనక్కి పంపుతున్నారు. వికారాబాద్-చేవెళ్ల సరిహద్దులోని ఓ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్కు చెందిన ఫాంహౌస్ సహా మొయినాబాద్ శివారు కేంద్రంగా వెలసిన ఓ రాజకీయ ప్రముఖుడి ఫాంహౌస్లు ఇందుకు నిత్య వేదికలుగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి తలుపు తట్టేందుకు ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసులు జంకుతుండటం గమనార్హం. గేట్లు దూకి బలవంతంగా లోపలికి వెళ్లిన పోలీసులపై వేట కుక్కలను వదులుతున్నట్లు తెలిసింది. పార్టీకి వచ్చి అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేశారని, డబ్బులుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భారీగా మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Chiranjeevi: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ దీవాళి విషెస్ పోస్టర్ చూశారా?
జిల్లాలో కొన్ని ఉదాహరణలు…
-బాకారం రెవెన్యూ పరిధిలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో నెల రోజుల క్రితం నిర్వహించిన ఓ బర్త్ డే పార్టీలో హుక్కా, విదేశీ మద్యం వినియోగించిన 51 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. వీరిలో 36 మంది వీసా గడువు ముగిసినట్లు గుర్తించారు.
-నాలుగు నెలల క్రితం ఎల్బార్పల్లిలోని ఫాం హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో నిర్వహించిన ముజ్రా పార్టీపై పోలీసులు దాడి చేసి 13 మంది యువకులు, ఏడుగురు యువతులు సహా గంజాయి, హుక్కా, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
-ఏపీకి చెందిన ఓ ప్రముఖ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ కంపెనీ తమ డీలర్ల కోసం మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కె.చంద్రారెడ్డి (కేసీఆర్) రిసార్ట్లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం సరఫరాకు అనుమతి తీసుకుని అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి 52 మంది డీలర్లు, 22 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
-మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫాంహౌస్లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది మహిళలు సహా 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉండడం గమనార్హం.
-ఆరు నెలల క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి, పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.
-కనకమామిడి సమీపంలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.
-నజీబ్నగర్ రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఆరుగురు యువకులు, నలుగురు యువతులను అరెస్ట్ చేశారు.
