Hydra: మియాపూర్లో హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు సర్కారు భూములు, చెరువులు, కుంటల్లోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఏర్పాటు చేసిన షెడ్లు, కన్వెన్షన్లు, తాత్కాలిక నివాసాలను తొలగించిన హైడ్రా(Hydra) ఏకంగా ఐదు అంతస్తులుగా నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ భవనాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు నిర్థారించుకున్న తర్వాతే హైడ్రా యాక్షన్ చేపట్టినట్లు తెలిసింది. అంతేగాక, అమీన్పూర్లో అనుమతులు తీసుకుని, మియాపూర్లోని హెచ్ఎండీఏకు చెందిన భూమిలో ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు హైడ్రా నిర్థారించింది. అమీన్పూర్లోని సర్వే నెంబర్లు 337, 338లకు పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: Hydra: రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
400 గజాల 126 నెంబర్ కలిగిన ప్లాట్
హుడా ఆమోదించిన లే అవుట్లోని 400 గజాల 126 నెంబర్ కలిగిన ప్లాట్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మియాపూర్ సర్వే నెంబర్ 101లోని ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/డి, 126/పార్ట్, 126/సీగా భాను కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం సృష్టించినట్లు తెలిపింది. మియాపూలోని హెచ్ఎండీఏకు చెందిన దాదాపు 473 గజాలు భూమిని కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. పైగా ఈ భవనానికి ఫేక్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ను కూడా సృష్టించినట్లు వెల్లడించింది.
డీడీ కూడా నకిలీదే
అంతటితో ఆగని ఆక్రమణదారులు ఎల్ఆర్ఎస్ కోసం చెల్లించినట్లు పేర్కొన్న డీడీ కూడా నకిలీదేనని తేల్చింది. మియాపూర్లో హెచ్ఎండీఏకు చెందిన స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని కూడా తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. స్థలాన్ని ఆక్రమించడం పట్ల హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. స్థానిక రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అన్ని విషయాలపై పరిశీలన జరిపిన తర్వాతే హెచ్ఎండీఏకు చెందిన భూమి కబ్జా పాలైనట్లు గుర్తించినట్లు హైడ్రా పేర్కొంది. ఆక్రమణదారులపై ఈ మేరకు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: Hydra: పార్కుల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్.. ఆక్రమణలు కబ్జాలపై ఫోకస్!
