TG High Court: గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌజింగ్ సొసైటీ లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పుబట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్లో 162 వరకూ ప్లాట్లుండగా, అందులోని మెజార్టీ ప్లాట్లు నావనన్న ఉద్దేశంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని కూడా హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలను తొలగించిందని కోర్టు స్పష్టం చేసింది. ఒకసారి లే ఔట్ వేస్తే, అదే కొనసాగుతుందని కూడా కోర్టు స్పష్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది.
సంధ్యా శ్రీధర్ రావుపై ఫిర్యాదు
సంధ్యా శ్రీధర్ రావు రహదారుల ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం విధితమే. ఈ విషయమై సంధ్యా శ్రీధర్ రావు హైకోర్టును ఆశ్రయించగా, ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయ్సేన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాధిత ప్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లే ఔట్లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్ రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని, తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధర్ రావు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని, లే ఔట్లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని కూడా బాధితులు న్యాయస్థానానికి వివరించారు. .
ప్లాట్లను చూసేందుకు వీలు లేని సమయంలో హైడ్రాను ఆశ్రయించాం : ప్లాట్ల యజమానులు
ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని సంధ్యా శ్రీధర్ రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు గాను సంధ్య శ్రీధర్ రావుకు రూ.10 లక్షలు సుప్రీంకోర్టు జరిమానా విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్లాట్లు చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోయారు. నేరుగా దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు.
ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు
హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల ఆక్రమణలను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తమను ఇబ్బందులకు గురిచేసినందుకు కోర్టుకు విన్నవించుకోవడానికే తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని వివరించారు. బాధితుల ఫిర్యాదులన్నీ ఆలకించినానంతరం జస్టిస్ విజయ్సేన్రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లే ఔట్లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసినట్లు హైడ్రా వెల్లడించింది.
