Cyber Crime: పెట్టుబడులపై భారీగా లాభాలంటూ ఎర వేసి 2.44 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన క్రిమినల్స్ కు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన 56 సంవత్సరాల వ్యాపారి ఇటీవల సోషల్ మీడియా యాప్స్ ను బ్రౌజ్ చేస్తుండగా సామ్ కో సెక్యూరిటీస్, ఐఎఫ్ఎల్ అప్లికేషన్లు కనిపించాయి.
తమ అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలను సొంతం చేసుకోండి అని కనిపించటంతో బాధితుడు వాటిని డౌన్ లోడ్ చేసుకున్నాడు. మొదట్లో ఈ అప్లికేషన్ల ద్వారా చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టాడు. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్ అతనికి మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు వచ్చాయంటూ ఆన్ లైన్ ద్వారా తెలిపారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడులతోపాటు లాభాలను ఆన్ లైన్ ద్వారానే విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రతీ విత్ డ్రాకు 6శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇది నమ్మిన సదరు వ్యాపారి వేర్వేరు విడతల్లో మొత్తం 2.44 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టాడు. ఆ తరువాత డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also read: Chennai Updates: చెన్నైలో అపరిచితుడు.. రియల్ హీరో అంటున్న నగర వాసులు..
ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ ప్రమోద్ కుమార్, ఎస్సై షేక్ అజీజ్ తోపాటు కానిస్టేబుళ్లు పరుశురాం, విజయ్ కుమార్, అశ్విన్ కుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్, రామాంజనేయ ప్రసాద్ లతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. నవీ ముంబయికి చెందిన రష్మిత్ రాజేంద్ర పాటిల్ కు చెందిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ అయినట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో సైబర్ క్రిమినల్స్ కమీషన్ ఇస్తామని చెప్పి అతని అకౌంట్లను ఉపయోగించుకున్నట్టుగా వెల్లడైంది.