Hydraa: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు ఆస్తులైన చెరువులు కుంటలు నారాలను కాపాడడంకు ఏర్పాటైన హైడ్రా(Hydraa) పాతబస్తీలో తవ్వి తీసిన బమృక్నుద్దౌలా చెరువు(Bamrukknuddaulah Lake) పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganadh) డెడ్ లైన్ విధించారు. ఈ మేరకు మంగళవారం ఆయన చెరువు పునరుద్ధరణ పండుగను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుందని తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి ఈ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో హైడ్రా పని పనిచేస్తుందని వివరించారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలోనే చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోగా, ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువును 18 ఎకరాల మేర విస్తరించి, వరద కట్టడితో పాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని హైడ్రా కమిషనర్ చెప్పారు. చెరువులోకి వరద నీరు చేరేలా నిండితే పోయేలా నిర్మించిన ఇన్లెట్(Inlet)లు, ఔట్లెట్(Outlet)లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
చెరువు చుట్టూ ఆకర్షణలు
చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్(Walking track)లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అలాగే చెరువు లోపలి వైపు కూడా ఎవరూ లోనకు వెళ్లకుండా గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు, అలాగే వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. పచ్చిక బైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే నగిషీలు చెక్కుతున్నారు. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరుస్తున్నారు. ఔట్లెట్కు మళ్లీ గేట్లు బిగిస్తున్నారు. స్థానిక నివాసితులు అక్కడకు వచ్చి సేద దీరే విధంగా రూపొందించడమే కాకుండా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు.
Alson Read: Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?
ఎంతో గొప్ప చరిత్ర
చార్ సౌ షహర్ హమారా, 435 ఏళ్లకు పైబడిన చరిత్ర హైదరాబాద్ నగరానిది. అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు మన సొంతం. అలాంటి కోవలోకే వస్తుంది 1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ఉద్దౌలా నిర్మించిన బమృక్నుద్దౌలా చెరువు. ఈ చెరువుకు సంబంధించిన సమాచారం స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. చారిత్ర ఆనవాళ్లు ప్రకారం వంద ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేదని, రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు, బమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. అలాగే బమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించే వారిని కథనాలున్నాయి. అంతే కాదు ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని, ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లే వారని చెబుతున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Supreme Court: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రాలకు నోటీసులు..!
