GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు, అత్యవసర సేవలు అందించే జీహెచ్ఎంసీ (GHMC) తన ప్రధాన ఆర్థిక వనరు అయిన ప్రాపర్టీ ట్యాక్స్ను పెంచకుండానే, ఏటా వచ్చే ట్యాక్స్ కలెక్షన్ను పెంచుకునేందుకు ఏడాది క్రితం ప్రారంభించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే కీలక సమాచారాన్ని వెల్లడించింది. గత సంవత్సరం జూలైలో ప్రారంభించిన ఈ సర్వేను నియోజియో సంస్థ ఇప్పటివరకు సుమారు 11 లక్షల ఆస్తులపై నిర్వహించినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీకి (GHMC) నగరంలోని సుమారు 19.5 లక్షల ఆస్తుల నుంచి ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. వీటిలో దాదాపు 2.5 లక్షల ఆస్తులు కమర్షియల్ ప్రాపర్టీలు. నియోజియో సంస్థ ఇప్పటివరకు 11 లక్షల ఆస్తులపై సర్వే పూర్తి చేయగా, ఇందులో 2.5 లక్షల వరకు ఉన్న కమర్షియల్ ప్రాపర్టీల సర్వే కూడా పూర్తయింది. ఒప్పందం ప్రకారం వచ్చే జనవరి మాసంలోపు ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉంది.
Also Read: Hyderabad Land Dispute: నమ్మి మోసపోయామంటున్న బాధితులు.. రూ.2 వేల కోట్లకు పైగా నష్టమంటూ ఆవేదన
6 లక్షల ఆస్తులు పన్ను పరిధిలో లేవు..
ఇప్పటివరకు సర్వే పూర్తి చేసిన 11 లక్షల ఆస్తులపై చేసిన పరిశీలనలో భాగంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తులు కలిపి దాదాపు 6 లక్షల ఆస్తులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు పరిధిలో లేనట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆస్తిపై నిర్మించిన అంతస్తులు, తీసుకున్న అనుమతులు, యూసేజ్ వంటి ప్రామాణికాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించినట్లు సమాచారం. ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాకుండా ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం మెయిన్ రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆస్తులే ఉన్నాయని, వీటిలో కమర్షియల్ ఆస్తులే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఈ 6 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపజేసి, వాటి నుంచి కనీసం రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో వచ్చే మార్చి కల్లా సుమారు రూ. 2500 కోట్ల ట్యాక్స్ వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పటివరకు రూ. 1100 కోట్ల ట్యాక్స్ను వసూలు చేసుకుంది. లక్ష్యానికి మిగిలిన రూ. 1400 కోట్లను వసూలు చేసుకునేందుకు అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ముందుగానే టార్గెట్లు ఫిక్స్..
సాధారణంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం తర్వాత కలెక్షన్పై ట్యాక్స్ సిబ్బంది, అధికారులు దృష్టి సారించేవారు. కానీ ఈసారి కమిషనర్ ఆర్వీ కర్ణన్ కాస్త ముందుగానే నగరంలోని 300 పైచిలుకు ప్రాపర్టీ ట్యాక్స్ డాకెట్లకు టార్గెట్లు ఫిక్స్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం డాకెట్ల వారీగా వసూలైన ట్యాక్స్ కలెక్షన్ను పరిగణలోకి తీసుకుని, దానికి 20 శాతాన్ని పెంచి సిబ్బందికి టార్గెట్లు ఇచ్చినట్లు సమాచారం. ప్రతి నెల 30 సర్కిళ్లలో రూ. 100 కోట్లకు తగ్గకుండా కలెక్షన్ చేయాలని టార్గెట్లు నిర్దేశించారు.
ప్రతి నెలా జీహెచ్ఎంసీ (GHMC) పర్మినెంట్, ఔట్సోర్స్ ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అవసరమైన రూ. 135 కోట్లలో సింహ భాగం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ నుంచే సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలకు రూ. 100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనని, లేని పక్షంలో జీతాల చెల్లింపులు కష్టతరం కావచ్చని ఇప్పటికే ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు సూచించినట్లు తెలిసింది. ప్రతి సర్కిల్లో ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించి, వాటిని చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలనే టార్గెట్లు కూడా ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న రూ. 2500 కోట్లలో ఇప్పటివరకు రూ. 1100 కోట్లు వసూలు కాగా, టార్గెట్ను చేరుకునేందుకు మిగిలిన రూ. 1400 కోట్లతో పాటు అదనంగా గుర్తించిన ఆస్తుల నుంచి జనవరి మాసం నుంచి మార్చి చివరి కల్లా రూ. 500 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసుకుని, మొత్తం రూ. 3 వేల కోట్ల కలెక్షన్ టార్గెట్ను పూర్తి చేసుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
Also Read: GHMC – Hydraa: జీహెచ్ఎంసీకి ఆ బాధ్యతలు కట్.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.