GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న సుమారు 8 వేల 300 మెట్రిక్ టన్నుల చెత్తను వీలైనంత త్వరగా సేకరించి, శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే విషయంపై జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారు. ముఖ్యంగా సిటీలో రోజురోజుకి పట్టణీకరణ పెరుగుతున్నందున చెత్త ఉత్పత్తి పరిమాణం కూడా పెరుగుతుండటంతో వీలైనంత త్వరగా చెత్తను తరలించేందుకు సెకండ్ లెవెల్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లను యుద్ద ప్రాతిపదికన పెంచుకునేందుకు బల్దియా సిద్దమైంది. మామూలు రోజుల్లోనే 8 వేల మెట్రిక్ టన్ను చెత్త ఉత్పత్తి అవుతుండగా, వినాయక నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ వంటి పండుగల సమయంలో మరో నాలుగు రేట్లు అదనంగా మెట్రిక్ టన్నుల చెత్త వస్తుండటంతో చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు అక్కడి నుంచి యార్డుకు తరలించేందుకు కష్టతరమవుతున్నందున జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 42 సెకండరీ కలెక్షన్ స్టేషన్లను 60కు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఇండ్ల నుంచి స్వచ్ఛ ఆటో..
ఇందుకు గాను కేవలం పక్షం రోజుల్లోనే స్థలాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని ముగ్గురు జాయింట్ కమిషనర్లు (శానిటేషన్ )లను ఆదేశించిన నేపథ్యంలో 30 సర్కిళ్లలో జాయింట్ కమిషనర్లు మొత్తం 36 స్థలాలను గుర్తించి అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్ ) సిఎన్ రఘుప్రసాద్ కు నివేదికలను సమర్పించినట్లు తెలిసింది. 42 సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్ల సంఖ్యను 60కు పెంచుకుంటే చెత్త తరలింపు మరింత వేగంగా జరిగే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నుంచి స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు సేకరిస్తున్న చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈ చెత్తను శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. చెత్తను మరింత వేగంగా సిటీ నుంచి తరలించేందుకు వీలుగా 30 సర్కిళ్ల పరిధిలో అదనంగా మరో 18 సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ముగ్గురు జాయింట్ కమిషనర్లు (శానిటేషన్) తిప్పర్తి యాదయ్య, మోహన్ రెడ్డి, సుధాంశ్ లు సర్కిళ్ల వారీగా ఖాళీగా ఉన్న జీహెచ్ఎంసీ, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 36 స్థలాలను గుర్తించారు.
Also Read: Hyderabad: ఓవైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్లో ముమ్మర సోదాలు
త్వరలో క్షేత్ర స్థాయిలో స్థలాల పరిశీలన..
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న 42 సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లను సందర్శించిన ముగ్గురు జాయింట్ కమిషనర్లు చెత్తను నిల్వ ఉంచేందుకు అనుకూలమైన స్థలాలను గుర్తించి సమర్పించిన నివేదికల ఆధారంగా త్వరలోనే అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్ ) ఆధ్వర్యంలో ముగ్గురు జాయింట్ కమిషనర్లు, స్థలాలను గుర్తించిన ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, మెడికల్(Medical) ఆఫీసర్లతో కలిసి త్వరలోనే క్షేత్ర స్థాయిలో స్థలాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతమున్న సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్ల తరహాలోనే స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని నిర్థారించనున్నట్లు సమచారాం.
ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఏర్పాటు..
ముఖ్యంగా జాయింట్ కమిషనర్లు గుర్తించిన స్థలాల్లో జీహెచ్ఎంసీకి చెందిన స్థలాలెన్నీ? ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాలెన్నీ? వాటి ఏరియా ఎంత? అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన స్థలాల్లోనే సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చి, ఆ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాల్లో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. జాయింట్ కమిషనర్లు మొత్తం 36 స్థలాలను గుర్తించినా, తొలి దశలో కేవలం 18 సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి, వాటి సంఖ్యను 60 కి పెంచుకోవాలని బల్దియా భావిస్తుంది. ప్రభుత్వ శాఖలతో జరిపిన సంప్రదింపులు సత్పలితాలిస్తే అదనంగా సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు.. మంత్రి ఫుల్ సీరియస్..?