GHMC: జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పునర్ వ్యవస్థీకరణలో బిజీగా ఉన్న అధికార యంత్రాంగానికి సిటీలోని పారిశుద్ధ్యం పనుల టెన్షన్ పట్టుకుంది. ఇదివరకు పారిశుద్ధ్య విధులను అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు నిర్వహించే వారు. వారిపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడం, వీరిలో చాలా మంది నిబంధనలకు విరుద్దంగా జీహెచ్ఎంసీ కొనసాగుతుండటం, ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు వెలుగు చూడటం, డాక్టర్లు సక్రమంగా శానిటేషన్ విధులు నిర్వహించడం లేదన్న విషయాన్ని కమిషనర్ కర్ణన్ గుర్తించారు.
దీంతో ఇటీవల శానిటేషన్ విధులను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ)లకు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన 60 సర్కిళ్లలో ఒక్కో సర్కిల్కు ఓ డీఈఈ, మరో అసిస్టెంట్ ఇంజినీర్ను నియమించారు. కానీ, పారిశుద్ధ్య విధులు నిర్వహణ తాము సిద్దంగా లేమని డీఈఈలు స్పష్టం చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పట్టణ స్థానిక సంస్థల విలీనం, మున్సిపల్ వార్డుల పునర్విభజన, వాటిపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ వాటి డిస్పోజ్ వంటి ప్రక్రియలను ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన కమిషనర్ కర్ణన్కు ప్రస్తుతం శానిటేషన్ను గాడిన పెట్టడటం ఓ కష్టతరమైన ప్రక్రియగా మారినట్లు చర్చ జరుగుతుంది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్లో రూ.2,260 కోట్లు కేటాయింపు!
ఆ పవర్ ఇస్తేనే
శానిటేషన్ బిల్లులు చెల్లించే చెక్ పవర్, రాంకీ చేపట్టే తమకు కేటాయిస్తేనే తాము శానిటేషన్ విధులు నిర్వహిస్తామని తేల్చి చెప్పడంతో శానిటేషన్ వింగ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. కొద్ది రోజుల క్రితం కమిషనర్ విధుల నిర్వహణపై శానిటేషన్ స్టాఫ్తో పాటు డీఈఈలు, ఏఈలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్తో శానిటేషన్ వింగ్ గాడిన పడిందని కమిషనర్ భావించగా, తాజాగా మరోసారి డీఈఈలు, ఏఈలు పారిశుద్ధ్య విధుల నిర్వహణకు ససేమిరా అనడంతో కమిషనర్ కర్ణన్ మరో సమావేశాన్ని నిర్వహించారు. ఈసారి ఆయన జూమ్ మీటింగ్లో పాల్గొని ఇంజినీర్లే పారిశుద్ధ్య విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
రాంకీపై పర్యవేక్షణ
దేశంలోని ముంబై, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్లే ఈ బాధ్యతలను నిర్వహిస్తుండటంతో ఇదివరకు ఈ విధులు నిర్వర్తించిన అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా హెల్త్ పరమైన కార్యక్రమాల్లో భాగమైన దోమల నివారణ, ఇమ్యూనైజేషన్, సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నివారణ వంటి బాధ్యతలను అప్పగించేలా కమిషనర్ కార్యాచరణను సిద్దం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీ నిర్వహించే శానిటేషన్ విధులపై ప్రధాన కార్యాలయం నుంచి మాత్రమే పర్యవేక్షణ ఉంది. రాంకీపై తమకు పర్యవేక్షణ బాధ్యతలను, రాంకీ బిల్లులను చెల్లించే పవర్ తమకు అప్పగిస్తే పనులు సక్రమంగా జరుగుతాయని, బిల్లుల చెల్లింపులు కూడా పారదర్శకంగా జరుగుతాయని డీఈఈ, ఏఈలు వాదిస్తున్నా, ఇందుకు ఉన్నతాధికారులు అంగీకరించడం లేదని తెలిసింది.
ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి
జీహెచ్ఎంసీలో (GHMC) ప్రస్తుతం అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్)గా విధులు నిర్వహిస్తున్న సీ.ఎన్. రఘుప్రసాద్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన్ను త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కమిషనర్ కర్ణన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో అదనపు కమిషనర్గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? ఎవరు శానిటేషన్ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారన్న విషయంపై కమిషనర్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు.. ఇన్టైమ్లోనే పూర్తి చేసేలా సర్కార్ చర్యలు!

