Smart Footpath: పాదచారుల భద్రత, సౌకర్యాలను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్తో పాదచారులకు అనుకూలమైన మోడల్ ఫుట్పాత్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ కారణంగా పాదచారుల భద్రతను పెంచాలని భావిస్తున్నది. ఇందుకు గాను జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్ 18, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో రోడ్ నెంబర్ 79/82 జంక్షన్ నుండి బీవీబీ జంక్షన్, రోడ్ నెంబర్ 82 వరకు ఒకటిన్నర కిలోమీటర్ల పొడువున నిర్మించనున్నారు. ఇందులో ఎడమ వైపు వెయ్యి మీటర్లు, కుడి వైపు 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జీహెచ్ఎంసీ రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ.కోటి 68 లక్షలు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ మోడల్ ఫుట్పాత్ను రానున్న నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నది.
ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ పేవర్ బ్లాకులు
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకులను ఉపయోగించనున్నారు. ఈ ప్లాస్టిక్ పేవర్ బ్లాకులు 65 నుంచి 70 శాతం పోస్ట్ కన్స్యూమర్ సింగిల్ యూజ్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. 35 ఎంపీఏ కంప్రెషన్ బలం కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు. 225 ఎంఎ × 112 ఎంఎం × 50 ఎంఎం జిగ్ జాగ్ ప్యాటర్న్ పరిమాణంలో వీటిని తయారు చేసి వినియోగించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. సాధారణ కాంక్రీట్ పేవర్లకు సరిసమానమైన దృఢత్వంతో వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడడానికి ఇవి తోడ్పడుతాయని పేర్కొన్నారు.
స్మార్ట్ ఫుట్పాత్ కోసం సోలార్ గ్రిడ్
ఫుట్పాత్ పైభాగంలో 10 కేడబ్ల్యుపీ సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 600 డబ్ల్యుపీ లేదా, అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్, 10 కేడబ్ల్యూ గ్రిడ్ టైడ్ ఇన్వర్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎంఎస్ మౌంటింగ్ స్ట్రక్చర్, ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్తో ఏసీ, డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లు, లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్లతో అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్, కమిషనింగ్తో సోలార్ రూప్ టాప్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని అధికారులు తెలిపారు. దృష్టి లోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్దేశం చేసేలా టాక్ టైల్ పేవర్లు, గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు.

