GHMC: జీహెచ్ఎంసీలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంపై సర్కార్ ఆగమేఘాలపై ఆదేశాలను జారీ చేసింది. అయితే పెరిగిన విస్తీర్ణానికి తగిన విధంగా సిబ్బందిని సమకూర్చే విషయాన్ని సర్కార్ మర్చిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీనానికి ముందు పట్టణ స్థానిక సంస్థల్లోని అరకొర సిబ్బంది అన్ని రకాల సేవలందిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇంజనీర్లే సింహా భాగం విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి గ్రామీణ వాతావరణంలో కొనసాగిన పట్టణ స్థానిక సంస్థల్లోని పౌర, అత్యవసర సేవలను జీహెచ్ఎంసీ తరహాలో అప్డేట్ చేసేందుకు చాలా మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ 27 పట్టణ స్థానిక సంస్థల్లోని సిబ్బందిని, వాటికి సమీపంలో ఉన్న జోన్ల సిబ్బందిని కలిపి వివిధ రకాల బాధ్యతలు అప్పగిస్తున్నారు.
డిప్యూటీ కమిషనర్లకు సైతం పని భారం తప్పడం లేదు
పదోన్నతులకు సిద్దంగా ఉన్న వారికి డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలను అప్పగించారు. అయినా సిబ్బంది సరిపోకపోవడంతో ఆయన ఒక్కోక్కరికి మూడు నుంచి నాలుగు రకాల బాధ్యతలను అప్పగిస్తూ సతమతమవుతున్నారు. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలు ఆదాయాన్ని సమకూర్చే భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్కు సరిపోయే సిబ్బంది లేకపోవడంతో ఆ విలీన సర్కిళ్లలో ఆ రెండు రకాల బాధ్యతలను కూడా జీహెచ్ఎంసీ అధికారులకే అప్పగించాల్సి వచ్చింది. జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లకు సైతం పని భారం తప్పడం లేదని తెలిసింది. కొత్తగా ఏర్పడిన రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్గా విధులు నిర్వహిస్తూనే జోనల్ కమిషనర్గా కూడా పని చేయాల్సి వస్తుంది. ఇదే తరహాలో అడ్మిన్ విభాగం కూడా మూడు జోన్లకు అడ్మిన్ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూనే ప్రధాన కార్యాలయంలోని అడ్మిన్ విభాగాన్ని పర్యవేక్షించాల్సి వస్తుంది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్..?
సిబ్బంది కొరతతో సర్దుబాటు
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను సాధించేందుకు పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగానికి చెందిన సిబ్బంది అసలు లేకపోవడం, ఉన్న పాత జీహెచ్ఎంసీ పరిధిలోని యూసీడీ విభాగంలో ఉన్న అరకొర సిబ్బందిని విలీన సర్కిళ్లలో సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఆర్గనైజర్స్ (సీవో)లను త్వరలోనే బదిలీ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
పని భారం మరింత పెరిగే అవకాశం
జీహెచ్ఎంసీ పాత పరిధిలోని 30 సర్కిళ్లలో వివిధ రకాల విధులు నిర్వర్తించేందుకు సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులున్నా, వీరిలో దాదాపు పది శాతం మంది ఉద్యోగులు వివిధ రకాల యూనియన్ల కార్యకలాపాలని చెబుతూ విధులకు హాజరు కాకుండానే జీతాలు స్వీకరిస్తున్నట్లు సమాచారం. మిగిలిన 23 వేల మంది ఔట్ సోర్స్ కార్మికులుండగా, వీరిలో సింహా భాగం కార్మికులు శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నా, తరచూ ఎక్కడో లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం సిబ్బందిని వినియోగించే శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ కొంత మేరకు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం స్టాఫ్ మెయింటెనెన్స్కు సంబంధించి జరుగుతున్న నియామకాలు, బదిలీలు తాత్కాలికంగా అయితే వ్యవస్థ ముందుకు సాగే పరిస్థితులుండగా ఒకే కార్పొరేషన్గా కొనసాగితే మాత్రం అధికారులు, సిబ్బందికి పని భారం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. ఇకపై ఫుడ్ సేఫ్టీ, ఇమ్యునైజేషన్పై ప్రత్యేక నిఘా..!

