GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో కమిషనర్గా ఉన్న ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు జరిగిన మొదటి ప్రజావాణి కార్యక్రమంలోనే టౌన్ ప్లానింగ్కు సంబంధించిన ఫిర్యాదులే సగానికి పైగా ఉండటం, అందులో అధిక భాగం అక్రమ నిర్మాణాలకు సంబంధించినవి కావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టాలని అప్పట్లో చీఫ్ సిటీ ప్లానర్ను ఆదేశించినప్పటికీ, పరిస్థితి మారలేదు. ప్రజావాణితో పాటు, ప్రతిరోజూ సాయంత్రం విజిటింగ్ వేళల్లోనూ కమిషనర్కు టౌన్ ప్లానింగ్పై వస్తున్న ఫిర్యాదులు ఏ మాత్రం తగ్గడం లేదు. నిత్యం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కమిషనర్ను సందర్శించే వారి నుంచి వస్తున్న ఫిర్యాదుల్లోనూ టౌన్ ప్లానింగ్కు చెందినవే ఎక్కువగా ఉండటంతో, కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Schools Reopen: నూతనోత్సాహంతో పాఠశాలల పున:ప్రారంభం!
తన సందర్శన వేళల్లో ఏకంగా చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) తన చాంబర్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సందర్శకుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అర్జీలపై కమిషనర్ అక్కడికక్కడే చీఫ్ సిటీ ప్లానర్ను ప్రశ్నించి, ఆర్జీదారులకు సమాధానం చెప్పిస్తున్నారు. దీంతో సీసీపీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య తన చాంబర్లో అధికారులకు, సందర్శకులకు అందుబాటులో ఉండటం లేదు.
త్వరలో సీసీపీ మార్పు?
కొద్ది నెలల క్రితం జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ సీటు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కమిషనర్ ఆర్వీ కర్ణన్ రాకముందే అప్పటి కమిషనర్ ఇలంబర్తి సీసీపీని మార్చాలని భావించినట్లు తెలుస్తున్నది. ఇలంబర్తి కమిషనర్గా ఉన్నప్పుడు 27 మంది న్యాక్ ఇంజినీర్లు అవినీతికి పాల్పడినట్లు గుర్తించి వారందరినీ విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా, కమిషనర్గా వచ్చిన ఆర్వీ కర్ణన్ కూడా టౌన్ ప్లానింగ్పై నిశిత పరిశీలన (సైలెన్స్ అబ్జర్వేషన్) చేయగా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కొనసాగుతున్న ఓ షాపింగ్ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు రెండు రోజుల క్రితం ఆ షాపింగ్ మాల్ను సీజ్ చేశారు. నెలన్నర రోజుల క్రితం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్వీ కర్ణన్ కూడా టౌన్ ప్లానింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు త్వరలోనే సీసీపీని మార్చుతారన్న చర్చ జరుగుతుంది.
ట్రాన్స్పోర్టు విభాగంపై..
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ట్రాన్స్పోర్టు విభాగం అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ట్రాన్స్పోర్టు విభాగంలో విధులు నిర్వహిస్తున్న 262 మంది ఉద్యోగులకు కొద్ది నెలలుగా జీతాలు చెల్లించలేదన్న విషయం కమిషనర్ దృష్టికి రావటంతో ఆయన సదరు విభాగం హెడ్పై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలని కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై కూడా ఆయన సదరు అధికారిపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read: IAS Officers: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్.. స్నేహ శబరీశ్ బదిలీ!