GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కురిసి ఆగిన తర్వాత చేపట్టాల్సిన సహాయక చర్యలను వేగవంతం చేయాలని, సహాయక చర్యల్లో హైడ్రాతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని జీహెచ్ఎంసీ కమినర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్తో కలిసి పరిశీలించారు. టోలీచౌకీ ఎక్స్ రోడ్, హకీంపేట్ కేజీఎన్ నల్లా, మోతీ దర్వాజా, అహ్మద్ కాలనీ, లంగర్హౌస్ హుడా చెరువు తదితర ప్రాంతాల్లో వర్షం ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్తో కలిసి మల్కం చెరువును పరిశీలించి చెరువు నీటి మట్టాలు, ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.
నిరంతర పర్యవేక్షణ
నీటి పారుదల, ట్రాఫిక్ పోలీసు, హైడ్రా, జల మండలి, డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంగా చేసుకుంటూ వర్షానంతర చర్యల్లో భాగంగా నీరు తొలగింపు, సిల్ట్ ,చెత్త తొలగింపు, రోడ్ల భద్రత పరమైన చర్యలను ముమ్మరం చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జీహెచ్ఎంసి హెల్ప్లైన్ 040-21111111 కి కాల్ చేయవచ్చునని తెలిపారు.
Also Read: Drug Peddlers Arrested: మరో భారీ సక్సెస్ సాధించిన ఈగల్ టీం.. స్మగ్లర్ల అరెస్ట్
కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ
వర్షాలకు సంబంధించి ఎప్పటికపుడు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఓఎస్డీ అనురాధను ప్రశ్నించారు. వర్ష సంబంధిత ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంతో పాటు, ఫీల్డ్ టీమ్ లకు వీలైనంత త్వరగా సమాచారమిచ్చి అప్రమత్తం చేయాలని కమిషనర్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. రియల్-టైమ్ మానిటరింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Congress Party Govt: రిజర్వేషన్లు గ్రామాల్లో పరిస్థితిపై సర్కార్ ఆరా