Drug Peddlers Arrested: డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపే లక్ష్యంతో ఏర్పాటైన ఈగల్ టీం(Eagle Team) మరో భారీ సక్సెస్ సాధించింది. గంజాయి స్మగ్లింగ్ చేయటమే వృత్తిగా చేసుకున్న ఇద్దరు పెడ్లర్లను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 4.20కోట్ల విలువ చేసే 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య(Sandeep Sandilya), ఎస్పీ రూపేశ్(SP Rupesh) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా(Odisha) రాష్ట్రం మల్కన్ గిరి నుంచి కొన్ని ముఠాలు తరచూ పెద్ద మొత్తంలో గంజాయిని తెలంగాణ, కర్ణాటక(Karnataka)ల మీదుగా ఉత్తరప్రదేశ్(UP) కు స్మగ్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈగల్ టీం అధికారులు ఈ గ్యాంగులపై దృష్టిని సారించారు. ఇన్ఫార్మర్ నెట్ వర్క్ తో ఎప్పటికప్పుడూ సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉత్తరప్రదేశ్(UP) రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్న బొలేరో వాహనంలో ఓ ముఠా పెద్ద మొత్తంలో గంజాయిని మల్కన్ గిరి నుంచి తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ క్రమంలో ఈగల్ టీం అధికారులతోపాటు ఖమ్మం(Khamma) ఆర్ఎన్సీసీ(RNCC) టీం సిబ్బంది అలర్ట్ అయ్యారు. గంజాయితో బయల్దేరిన గ్యాంగ్ శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి మీదుగా బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్లనున్నట్టు తెలియటంతో ప్రత్యేక బృందాలను మోహరించారు. సమాచారం అందినట్టుగానే బొలేరో వాహనం అటుగా రాగా శంషాబాద్ రోడ్డు(Shamshabad Road)లోని జామా మసీదు వద్ద అడ్డుకున్నారు. తనిఖీ చేయగా అందులో బ్రౌన్ కలర్ పేపర్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఆ తరువాత ప్లాస్టిక్ బ్యాగుల్లో తరలిస్తున్న 847 కిలోల గంజాయి దొరికింది.
ఇద్దరూ పాతనేరస్తులే
ఈ క్రమంలో అధికారులు గంజాయి తరలిస్తున్న ఖిల్లా ధన(Killa Dhana), రాజేందర్ బజింగ్(Rajender Bajing) లను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఇద్దరు చాలా రోజులుగా గంజాయి దందా చేస్తున్నట్టుగా వెల్లడైంది. 2019లో ఇరవై కిలోల గంజాయిని తరలిస్తూ ఖిల్లా ధన ఆంధ్రప్రదేశ్(AP) రాష్టం డొంకరి పోలీసులకు పట్టుబడినట్టుగా తెలిసింది. నాలుగు నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో(Rajahmundry Central Jail) ఉన్నట్టుగా కూడా వెల్లడైంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత ఖిల్లా ధన గంజాయి స్మగ్లింగ్ ను కొనసాగిస్తున్నట్టుగా నిర్దారణ అయ్యింది. ఈ సంవత్సరంలోనే మల్కన్ గిరి నుంచి మూడుసార్లు 350, 500, 600 కిలోల గంజాయిని ఉత్తరప్రదేశ్(UP) కు చేర్చినట్టుగా తేలింది.
Also Read: ACB Record: 145 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్.. రాష్ట్రంలో ఇదే పెద్ద రికార్డ్
స్మగ్లింగ్ వాహనాలకు కో డ్రైవర్
అధికారులు దాడులు జరిపితే తప్పించుకుని పారిపోవటానికిగాను తనతోపాటు నిత్యం ఓ తల్వార్(Talwar) ను వెంటబెట్టుకునే వాడని తేలింది. ఈ క్రమంలో అధికారులు అతని నుంచి ఓ తల్వార్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, రెండో నిందితుడు రాజేందర్ బజింగ్(Rajender Bajing) కూడా పాతనేరస్తుడని దర్యాప్తులో స్పష్టమైంది. 2023లో నర్సీపట్నం పోలీసులు అతన్ని 150 కిలోల గంజాయి తరిస్తుండగా అరెస్ట్ చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో వైజాగ్ సెంట్రల్ జైలులో 10నెలలపాటు అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్టుగా తెలిసింది. రాజేందర్ బజింగ్ కు వేర్వేరు రూట్లపై సమగ్ర అవగాహన ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వాహనాలకు అతను కో డ్రైవర్ గా కొన్నిసార్లు ఎస్కార్టుగా వ్యవహరించే వాడని నిర్ధారణ అయ్యింది.
ఆ ఇద్దరిది కీలకపాత్ర
ఇక, అధికారులు జరిపిన విచారణలో ప్రస్తుతం పరారీలో ఉన్న రమేశ్ సుక్రీ(Ramesh Sukri), జగదీశ్ కుల్దీప్(Jagdish Kuldeep) లది ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కీలకపాత్ర అని వెల్లడైంది. జగదీశ్ కుల్దీప్ తనకు పరిచయం ఉన్న షిబో ఎలియాస్ షిబా, బసుల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి కొని ఖిల్లా ధన, రాజేందర్ బజింగ్ లకు ఇచ్చేవాడని తేలింది. ఇక, ఎలా స్మగ్లింగ్ చేయాలన్న దానిని రమేశ్ సుక్రీ కో ఆర్డినేట్ చేసేవాడని స్పష్టమైంది. ఇలా, స్మగుల్ చేసిన గంజాయిని ఖిల్లా ధన, రాజేందర్ బజింగ్ లు ఉత్తరప్రదేశ్(UP) కు చెందిన షఫీక్ ఎలియాస్ షఫీకి(Shafi) అమ్ముతూ వస్తున్నట్టుగా తేలింది. దీని కోసం షఫీ అడ్వాన్సుగా డబ్బు ఇవ్వటంతోపాటు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలను సమకూరుస్తూ వస్తున్నట్టుగా తేలింది. పరారీలో ఉన్న రమేశ్ సుక్రి, జగదీశ్ కుల్దీప్, షిబో, బసు, షఫీల్ కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
శభాష్…
పక్కగా సమాచారాన్ని సేకరించి కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేసిన డీఎస్పీ సీహెచ్.శ్రీధర్(DSP Srideer), సీఐ విజయ్(CI Vijay), ఎస్ఐ రవిప్రసాద్(SI Ravi Prasad), సీఎన్పీఎస్ డీఎస్పీ హరిశ్చంద్రా రెడ్డి, సీఐలు రమేశ్ రెడ్డి, రాము నాయక్ తోపాటు సిబ్బందిని ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ రూపేశ్ అభినందించారు.
Also Read: E Visitor passes: సచివాలయంలో ఈ-విజిటర్ పాస్.. స్కాన్ ద్వారా ఎంట్రీ