DCP lavanya: ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు వెంటపడి వేధించే వారు కొందరైతే…సోషల్ మీడియాలో పరిచయమై బ్లాక్ మెయిల్ చేసేవారు ఇంకొందరు. వీడియోలు,ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునేవారు మరికొందరు.అయితే ఇలాంటి వారికి ఏమాత్రం భయపడవద్దని ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య చెప్పారు. సమస్య వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాళ్ల వివరాలను గోప్యంగా పెడతామని చెప్పారు.
ఫేస్ బుక్ లో పరిచయమై..
హైదరాబాద్ కు చెందిన 30 సంవత్సరాల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఓయో హోటల్ కు తీసుకెళ్లి రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ తరువాత లక్ష రూపాయలు ఇవ్వాలని, తాను పిలిచినప్పడుల్లా రావాలని, లేనిపక్షంలో నీ స్నేహితురాళ్లను పరిచయం చేయాలని బెదిరించటం మొదలు పెట్టాడు.
చెప్పినట్టు చేయకపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగిన షీ టీమ్స్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ఇదొక్కటే కాదు.. పొరుగింట్లో నివాసముంటూ వీడియోలు రికార్డు చేసి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించిన ఓ ప్లంబర్ ను కూడా అరెస్ట్ చేసినట్టు డీసీపీ డాక్టర్ లావణ్య తెలిపారు.
Also read: Aghori Remand Report: అఘోరీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
ఇక, పోలీసులనే లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మహిళను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. ఓ మహిళను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన జీహెచ్ఎంసీ డ్రైవర్ ను కూడా కటకటాల వెనక్కి పంపించినట్టు తెలియచేశారు. ఇక, ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికలను మోసం చేసి లైంగిక దాడులకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్ట్ చేసి ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేట పోలీస్ స్టేషన్లలో పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయించినట్టు చెప్పారు.
పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు, బాలికలను వేధిస్తున్న 49మందిని ఆధారాలతో పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మహిళలు, మైనర్ బాలికలు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. దాంతోపాటు షీ టీమ్స్ హెల్ప్ లైన్ అయిన 94906 16555 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని, వాట్సాప్ చేయవచ్చని చెప్పారు.