GHMC: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోడ్ ఇవాళ సాయంత్రంతో ముగియనున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 6వ తేదీన ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయడంతో అమల్లోకి వచ్చిన కోడ్ ఇవాళ సాయంత్రంతో ముగియనున్నది. అనధికారికంగా ఓట్ల కౌంటింగ్ ముగిసిన వెంటనే కోడ్ తొలగినట్టే కానీ, అధికారికంగా ఇవాళ సాయంత్రం వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Also Read: GHMC: మెడికల్ ఆఫీసర్ల అక్రమాలకు చెక్.. బల్దియాలో కీలక సంస్కరణలకు కమిషనర్ సిద్ధం
ప్రజావాణి కార్యక్రమం
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా కొత్త అభివృద్ది పనుల హామీ వంటివి కోడ్ అమల్లో భాగంగా నిషేధించారు. దీంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్కారు ఆఫీసుల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను కూడా నిలిపేశారు. ఇప్పుడు కోడ్ ముగుస్తుండడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు శనివారం జీహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. కలెక్టరేట్లో కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన ప్రకటించారు.
స్టాండింగ్ కమిటీ సమావేశం
ఇవాళ సాయంత్రంతో ఎలక్షన్ కోడ్ ముగుస్తున్నందున 21న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలిసింది. దీంతో పాటు నగరాభివృద్ధి, పౌర సేవల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీహెచ్ఎంసీ పాలక మండలి కౌన్సిల్ సమావేశాన్ని కూడా 25వ తేదీన నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో విగ్రహాల ఆవిష్కరణ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఎంట్రెన్స్లో దశాబ్దంన్నర కాలంగా పెండింగ్లో ఉన్న మూడు విగ్రహాల వివాదాన్ని అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రతిష్టించిన మహాత్మా గాంధీ, అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాల వివాదానికి ఇటీవలే అధికారులు తెర దింపారు. ఈ మూడు విగ్రహాల్లో మేయర్ ఎంట్రెన్స్కు ఎడమ వైపు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ఎడమ వైపు దేవాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: GHMC: ముమ్మరమైన రోడ్ సేఫ్టీ డ్రైవ్.. ఇప్పటి వరకూ వరకు 20 వేల 337 గుంతలు పూడ్చివేత!
