Drugs Seized: గే యాప్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు చిలకలగూడ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. విచారణలో వెల్లడైన వివరాలతో వీరి నుంచి మాదక ద్రవ్యాలు కొంటున్న మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ డాక్టర్ కూడా ఉన్నాడు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 15లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్(MDMA drug) ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ అసహజ లైంగిక కార్యకలాపాలకు అలవాటు పడి డ్రగ్స్ తీసుకుంటుండటం.. వీరిలో కొందరికి హెచ్ఐవీ(HIV) సోకటం గమనార్హం.
ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి(DCP Balaswami) టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు, ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన ఎం.రమాకాంత్ ఎలియాస్ కిరణ్ (44) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో 2000వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాడు. చిలకలగూడలో నివాసముంటూ ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇక, హైదరాబాద్ వచ్చిన యేడాదే రమాకాంత్ వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య విభేధాలు తలెత్తాయి. దాంతో భార్య అతన్ని వదిలేసింది.
లైంగిక సామర్థ్యం కోసం…
ఈ క్రమంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం రమాకాంత్(Ramakanth) ఎండీఎంఏ డ్రగ్ తీసుకోవటం మొదలు పెట్టాడు. గ్రైండర్(Grinder App) అనే గే యాప్ ద్వారా కొంతమంది యువకులకు మాదక ద్రవ్యాలు అమ్ముతూ వారితో అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో రమాకాంత్ కు హెచ్ఐవీ సోకింది. అయినా, రమాకాంత్ యువకులను తన ఫ్లాట్ కు పిలిపించుకోవటంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి డ్రగ్స్ ఇస్తూ కోరికలు తీర్చుకోవటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతనికి వాక్యూం టెక్నీషియన్ గా పని చేస్తున్న ముదావత్ ప్రసాద్ (30)తో పరిచయం ఏర్పడింది.
నైజీరియన్ నుంచి…
ఆ తరువాత ముదావత్ ప్రసాద్ తో కలిసి రమాకాంత్ ఎండీఎంఏ డ్రగ్ అమ్మటం మొదలు పెట్టాడు. తరచూ బెంగళూరు వెళుతూ అక్కడ ఉంటున్న ఓ నైజీరియన్ నుంచి గ్రాము ఎండీఎంఏను 10వేల రూపాయలకు కొని తెచ్చి ఇక్కడ 15వేల రూపాయలకు గ్రాము చొప్పున అమ్ముతున్నాడు. ఇలా డ్రగ్ అమ్ముతూ 2024, జూలైలో రమాకాంత్, ముదావత్ ప్రసాద్ లు చిలకలగూడ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన రమాకాంత్ డ్రగ్స్ అమ్మకాలను తిరిగి కొనసాగించాడు.
Also Read: HHVM: ‘హరి హర వీరమల్లు’ నుంచి బయటకు రావడానికి అసలు కారణం ఏంటో చెప్పిన క్రిష్!
సమాచారాన్ని సేకరించి…
రమాకాంత్, ముదావత్ ప్రసాద్ లు సాగిస్తున్న డ్రగ్స్ దందా గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగార్జున, చిలకలగూడ బీ.అనుదీప్, ఎస్ఐలు మనుషా రెడ్డి, ఎస్.కరుణాకర్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి రమాకాంత్ ఫ్లాట్ పై దాడి చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
డాక్టర్ తోపాటు…
ఈ ఇద్దరిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ మరో ఏడుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మలక్ పేట(Mlakpet)లోని ఇండో యూఎస్ హాస్పిటల్(Indo US Hospital) లో సర్జన్ గా పని చేస్తున్న డాక్టర్ ఆతిఫ్ అబ్దుల్ సమీ(Dr. Atif Abdul Sami) (38), మాదాపూర్ నివాసి, సెక్స్ వర్కర్ అయిన కరిచెర్ల వినయ్ కుమార్ (30), మెన్స్ హాస్టల్ ఉద్యోగి కొత్తపల్లి మోషా ఎలియాస్ మోజెస్ (29), బల్లం వంశీకృష్ణ (38), కేతావత్ రాజు నాయక్ ఎలియాస్ నాయక్ (29), ఐటీ రిక్రూటర్ గా పని చేస్తున్న షేక్ సమీర్, ప్రైవేట్ ఉద్యోగి ఆదేపు సత్య సురేష్ బాబు ఎలియాస్ సురేష్ (51) ఉన్నారు. నిందితులు స్వలింగ సంపర్కానికి అలవాటు పడి డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా డీసీపీ బాలస్వామి చెప్పారు. ఈ క్రమంలో కొందరికి హెచ్ఐవీ కూడా సోకిందని తెలిపారు. యువకులు ఇలాంటి వారి ఉచ్ఛులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నైజీరియన్ అరెస్ట్
అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ ను హైదరాబాద్(Hyderabad) నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితున్ని స్వదేశానికి పంపించే ప్రక్రియను పూర్తి చేశారు. డీసీపీ సుధీంద్ర(DCP Sudhindra) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా(Nigeria) దేశానికి చెందిన అలీ ఎనుకే ఫార్చునటస్ అకుడిన్వా ఎలియాస్ ఫార్చూన్(Ali Enuke Fortunatus Akudinwa Elias Fortune) (30) తొమ్మిదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చాడు. ఆ తరువాత హైదరాబాద్(Hyderabad) చేరుకుని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు పబ్బుల్లో డీజేగా పని చేయటం మొదలు పెట్టాడు.
అదే సమయంలో తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందా కూడా ప్రారంభించాడు. కాగా, లంగర్ హౌస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫార్చూన్ ను హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సీఐ బాలస్వామి ఎస్ఐ మనోజ్ కుమార్ తో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వర్గాలతో తనిఖీ చేయించగా అతని వీసా కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది. అక్రమంగా ఇక్కడ ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!