Ganesh Immersion: నిమజ్జన శోభాయాత్రను చూడటానికి వెళుతున్నారా?… అయితే… జర పైలం. పిక్ పాకెటర్లు మీ జేబు కత్తిరించొచ్చు. చెయిన్ స్నాచర్లు గొలుసులు తెంచుకోవచ్చు. లక్షలాది మంది పాల్గొనే నిమజ్జన ఊరేగింపులో అందిన కాడికి దోచుకోవటానికి ఇప్పటికే కొన్ని ముఠాలు సిద్ధమయ్యాయని తెలిసింది. ఈ మేరకు సమాచారం అందటంతో పిక్ పాకెటర్లు, చెయిన్ స్నాచర్లకు చెక్ పెట్టటానికి పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు.
రెప్పపాటులో మాయం..
భారీ బహిరంగ సభలు, ర్యాలీలు జరిగినా…పెద్ద సంఖ్యలో జనం పాల్గొనే ఉత్సవాలు వచ్చినా పిక్ పాకెటర్లు, చెయిన్ స్నాచర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరి నుంచి నలుగురు వరకు గ్యాంగ్ గా ఏర్పడి జనంలో కలిసిపోయి టార్గెట్ గా చేసుకున్న వారి నుంచి పర్సులు, నగదును రెప్పపాటులో తస్కరిస్తారు. ఈనెల 6న జరుగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను కూడా ఈ ముఠాలు టార్గెట్ గా చేసినట్టు సమాచారం. ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని గ్యాంగులు కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వీరికి అడ్డుకట్ట వేయటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు.
Also Read: GAMA Awards 2025: గామా అవార్డ్స్లో ‘పుష్ప 2’ సరి కొత్త రికార్డ్?
ఇలాంటి వారిపై నిఘా
సివిల్ దుస్తుల్లో ఉండే పోలీసులు ఊరేగింపులో ఇలాంటి వారిపై నిఘా పెడతారు. దాంతోపాటు సీసీ కెమెరాలతో కూడా వీరిపై నిఘా పెట్టనున్నారు. అయితే, తాము ఎన్ని చర్యలు తీసుకున్నా జనం జాగ్రత్తలు తీసుకున్నపుడే ఇలాంటి వారికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఊరేగింపులో పాల్గొనేవారు. .చూడటానికి వెళ్లేవారు తమ వెంట పెద్ద మొత్తాల్లో నగదును పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. బంగారు గొలుసులు.. ముఖ్యంగా మహిళలు ధరించక పోతే మంచిదని అంటున్నారు.
Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!