Hydraa: హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని, అన్ని రాష్ట్రాల్లో సేవలు అవసరమని ఢిల్లీ మున్సిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. అప్పుడే చెరువులు, నాలాలు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్పేట(Ambeer pet)లోని బతుకమ్మ కుంట(Bathukamma Kunta)ను ఢిల్లీ మున్సిపల్ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం సందర్శించింది. చెరువు చుట్టూ తిరుగుతూ, అభివృద్ధిని దశలవారీగా అడిగి తెలుసుకుంది. ఒకప్పుడు చెత్తా చెదారం, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రాంతం చెరువులా రూపాంతరం చెందడాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
ఈ చెరువు నిర్మాణం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీ మున్సిపల్ హార్టికల్చర్ విభాగం అధిపతి డా. ఆశిష్ అన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్గించడం, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చిన వీడియోలను పరిశీలించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో కూడా చెరువులు చాలా వరకు కబ్జాకు గురి అయ్యాయని, హైడ్రా(Hydraa) వంటి సంస్థతో వాటిని పునరుద్ధరించడం, పరిరక్షించడం సులభమవుతుందని బృందం పేర్కొంది.
ప్రయోజనాలపై పత్యేక ఆసక్తి
ఈ చెరువు లేనప్పుడు వరద ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అనే అంశంపై ఢిల్లీ బృందం ఎంతో ఆసక్తిగా ఆరా తీసింది. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాలువ లోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్లెట్ను నిర్మించడాన్ని పరిశీలించింది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు బృందానికి చూపించారు. ఈ వరద నీరు గతంలో ఎటు వెళ్లేదని స్థానికులతో కూడా మాట్లాడి ఈ బృందం తెలుసుకుంది.
వరద నీరు తమ బస్తీలను, కాలనీలను ముంచెత్తేదని, ఈ సారి ఆ ముప్పు తప్పిందని వారంతా పేర్కొన్నారు. చెరువు ఔట్లెట్లను కూడా ఈ బృందం పరిశీలించింది. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, చెరువులను అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్ ఎండీ పి. యూనస్తో పాటు హెచ్ఎండీఏ, ఆస్కీ అధికారులు కూడా ఢిల్లీ బృందంతో పాటు బతుకమ్మకుంట ను సందర్శించిన వారిలో ఉన్నారు.
Also Read: Rahul Gandhi: బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్