Crime News: సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో అల్వాల్ పోలీసులు రెండు రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితున్ని అరెస్ట్ చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ సూర్యనగర్ లో నివాసులు, భార్యభర్తలైన రాజమ్మ (65), కనకయ్య (70)లు ఈనెల 4న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.
దీనిపై కేసులు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు మచ్చబొల్లారం కృష్ణానగర్ కాలనీకి చెందిన చింతకింది అనిల్ (40)ను అరెస్ట్ చేశారు. విచారణలో అనిల్ పాత నేరస్తుడని వెల్లడైంది. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై 29 కేసులు నమోదై ఉన్నట్టుగా తెలిసింది. వృద్ధ దంపతులను హత్య చేయటానికి ముందు రోజు సూర్యనగర్ లోనే ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించినట్టు వెల్లడైంది.
Also Read: Operation sindoor: ఆపరేషన్ సింధూర్.. తెలంగాణలోభద్రతా చర్యలపై.. ముఖ్యమంత్రి సమీక్ష!
చప్పుడుకు ఇంట్లోవాళ్లు లేవటంతో పరారైన అనిల్ ఆ మరుసటి రోజు కనకయ్య దంపతుల ఇంట్లోకి చొరబడి కర్రతో భార్యాభర్తల తలలపై కొట్టి చంపి రాజమ్మ మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం, వెండి పట్టగొలుసులు, ఇంట్లోని నగదు, రెండు మొబైల్ ఫోన్లను దోచుకుని ఉడాయించినట్టుగా నిర్ధారణ అయ్యింది.
ఈ క్రమంలో నిందితున్ని పోలీసులు జైలుకు రిమాండ్ చేశారు. కేసును పర్యవేక్షించిన ఏసీపీ రాములు, దర్యాప్తు జరిపిన సీఐలు రాహుల్ దేవ్, తిమ్మప్ప, దాలి నాయుడు, శ్యాం సుందర్ రెడ్డితోపాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు